- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీకి రామ్ రామ్.. 50 రోజులకు మించి పని లేదు.. కేంద్రంపై మంత్రి సీతక్క ఆగ్రహం
మహాత్మా గాంధీ పేరును తొలగించి జీ రాంజీ పేరుతో ఉపాధి హామీకి రామ్ రామ్ చెబుతోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా గాంధీ పేరును తొలగించి జీ రాంజీ పేరుతో ఉపాధి హామీకి రామ్ రామ్ చెబుతోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. అణగారిన వర్గాలపై జరుగుతున్న ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, కూలీల ఉపాధి హక్కును కాపాడుకునేందుకు కలసి కట్టుగా పోరాడుతామని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉపాధి హామీ పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. నిరసన కార్యక్రమాల్లో కార్మికులు, కర్షకులు, కూలీలు, సర్పంచులు, ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల శక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో ఆమె పిలుపునిచ్చారు.
పల్లెల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉరి వేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. లోక్ సభలో పూర్తిస్థాయి చర్చ లేకుండా, హడావుడిగా బిల్లును పాస్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధి హామీ కూలీల్లో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఉపాధి పొందుతున్నారని.. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉపాధి కూలీల్లో 60 శాతం మహిళలు, తెలంగాణలో ఉపాధి హామీ లబ్ధిదారుల్లో 62 శాతం మహిళలే ఉన్నారని, అలాగే 20 శాతం ఎస్సీలు, 20 శాతం ఎస్టీలు లబ్ధిదారులుగా ఉన్నారని, కేంద్ర వైఖరి కారణంగా వారంతా ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు.
ఉపాధి హామీ చట్టం కేవలం ఉపాధి హామీ కల్పనకే పరిమితం కాలేదని, మహిళలు అట్టడుగు వర్గాల ఆర్థిక స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలగన్న రామ రాజ్యం, గ్రామ స్వరాజ్యం స్ఫూర్తితో యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏడాది పనిదినాలను తగ్గిస్తూ పేదల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 45 కోట్ల పనిదినాలకు కోత, తెలంగాణలో 5 కోట్ల పనిదినాలకు కోత పెట్టారని తెలిపారు.
50 రోజులకు మించి పని ఇవ్వలేదు:
జి రామ్ జి చట్టం ద్వారా 125 రోజులు పని కల్పిస్తామని పైకి చెప్పినా, బీజేపీ పాలనలో ఏ ఏడాదీ 50 రోజులకు మించి పని ఇవ్వలేదని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకి నివేదించిందని అన్నారు. గాంధీ వర్సెస్ రాముడు అన్నట్లుగా చర్చను చిత్రీకరించి దొడ్డి దారిన ఉపాధి చట్టం ఉసురుతీస్తున్నారని మండిపడ్డారు. ఇదివరకు ఉపాధి హామీ పనులకు కేంద్రం 100 శాతం నిధులు ఇస్తే, ఇప్పుడు తన బాధ్యత నుంచి తప్పుకుని 60 శాతం మాత్రమే ఇచ్చి 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.






