- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్సే.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసింది బీఆర్ఎస్సే అని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసింది బీఆర్ఎస్సే అని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, BC రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందన్నారు. బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు.
2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్గా సర్పంచ్ల రిజర్వేషన్లను టీఆర్ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని గుర్తుకు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు అయినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి అన్నారు. కొన్ని మండలాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో ఆ పరిమితిని దాటి పోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగినట్లు స్పష్టం చేశారు. సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, జడ్పీటీసీలకు జిల్లాను, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నామని వివరించారు.
బీఆర్ఎస్ నేతలు బీసీల మంచిని కోరుకునే పరిస్థితిలో లేరని సీతక్క పేర్కొన్నారు. కుల గణనలో బీఆర్ఎస్ పాల్గొనలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు నిలిచిపోవాలని కోర్టుల్లో అడ్డంకులు సృష్టించిన పార్టీ బీఆర్ఎస్సేనని ఆమె ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు. భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనాభా ప్రాతిపదికన 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజన సీట్ల సంఖ్య సహజంగా పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బీసీల గొంతు కోసింది ఎవరు, కుల గణనను అడ్డుకుంది ఎవరు, రిజర్వేషన్లపై అడ్డంకులు సృష్టించింది ఎవరు అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.






