పెండింగ్ బిల్లులపై సంతకం చేయాలి.. గవర్నర్ కు లేఖ రాసిన మంత్రి సత్యవతి రాథోడ్

by Dishafeatures2 |
పెండింగ్ బిల్లులపై సంతకం చేయాలి.. గవర్నర్ కు లేఖ రాసిన మంత్రి సత్యవతి రాథోడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువత పట్ల ప్రేమ ఉంటే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ వెంటనే సంతకం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ విజ్ఞప్తి చేశారు. ఉగాది రోజూ యువతకు తిపికబురు అందించాలని కోరారు. మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, వివక్షతోనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, గవర్నర్ హోదాలో తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలను అడ్డుకునేలా చట్టాలను తొక్కి పెడుతున్నారన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అనేక అన్యాయాలతో జరుగుతున్న నష్టాన్ని కూడా యువత గుర్తించుకుంటున్నారన్నారు. తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు గవర్నరే ప్రత్యేక్ష కారణమన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నత విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్న సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును పెండింగ్ లో పెట్టారన్నారు.

దీంతోపాటు యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను అందించాలని ఉద్దేశించిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులను కూడా పక్కన బెట్టారన్నారు. రాష్ర్టంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు రాజభవన్, కేంద్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు. యువత ఇబ్బందులు గవర్నర్ పుణ్యమే అని లేఖలో పేర్కొన్నారు. రాజ్ భవన్ చాలెంజ్లను స్వీకరించేందుకు సిద్దంగా ఉంటే, తెలంగాణ యువత ఇస్తున్న ఛాలెంజ్ ను స్వీకరించి కేంద్ర వైఖరి పై బీఆర్ఎస్ తో కలిసి రావాలని కోరారు. యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాట వాస్తవం అయితే కేంద్రం అన్యాయాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర వైఖరిపైన గళమెత్తాలని కోరారు.

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీని దాటి రెండు లక్షల30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నామని, ప్రైవేటు రంగంలో దాదాపు 22 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేలా పారిశ్రామిక విధానాన్ని తీర్చిదిద్ది తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నామన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలను కల్పించుకుంటూ దేశానికి అగ్రగామి తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.

కేంద్రం ఐటీఐఆర్ ను రద్దు చేసి హైదరాబాద్ తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలపై దెబ్బ కొట్టిందని, మరోపైపు కేంద్రం ఉద్యోగ,ఉపాధి అవకాశాలను దెబ్బకొట్టడుతూనే ఉందని ఆరోపించారు. తెలంగాణకు దక్కాల్సిన విద్యాసంస్థల విషయంలోనూ తీరని అన్యాయం చేస్తున్నదన్నారు. ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క మెడికల్ కాలేజీని కేటాయించలేదని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును తుంగలో తొక్కిందని ఆరోపించారు. బయ్యారం,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఢిపెన్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం వివక్ష చూపుతుందన్నారు. గవర్నర్ గా ఉన్నప్పటికీ అధికారికంగా ఒక్క లేఖనో, విజ్ఞప్తినో చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇది తెలంగాణ యువతపై అవకాశవాద ప్రేమకు అద్దం పడుతుందని మండిపడ్డారు. గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.



Next Story