మారిపోయిన విద్యాశాఖ మంత్రి సబిత.. 2023కు అలాగే స్వాగతం పలకాలట

by Disha Web Desk |
మారిపోయిన విద్యాశాఖ మంత్రి సబిత.. 2023కు అలాగే స్వాగతం పలకాలట
X

దిశ, డైనమిక్ బ్యూరో : 5 రోజుల్లో 2022 ఏడాది ముగిసి 2023 నూతన సంవత్సరం రానున్న సందర్భంగా తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు బొకేలు, శాలువలు తీసుకురావొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ఇతర నేతలను, అధికారులను కలువటానికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. బోకేలు, శాలువాలు తదితర వాటి కోసం చేసే వృథా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు, చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని విద్యార్థులకు అందించాలని కోరారు.

రానున్న నూతన సంవత్సరం 2023 సందర్భంగా అందరూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని, అమలు చేయాలని కోరారు. నూతన సంవత్సరంతో పాటుగా జన్మదినాల సందర్భంగా ఇలాంటి సమాజ హిత కార్యక్రమం చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా కూడా ఇదే విధానాన్ని పాటించాలని కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ దిశగా రానున్న జనవరి 1వ తేదీ నుండి ఈ నిర్ణయాన్ని అమలు చేసి జిల్లాలో ఓ సరికొత్త విధానానికి నాంది పలుకలన్నారు..నాయకులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఆయా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.



Next Story