అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు... నేతలు కాదు: మంత్రి పువ్వాడ

by Dishafeatures2 |
అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు... నేతలు కాదు: మంత్రి పువ్వాడ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీకి మమ్మల్ని పంపాల్సింది ప్రజలు.. నేతలు కాదని.. కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. అసెంబ్లీలో మా నాన్న నేను అడుగు పెట్టామని ఇది ప్రజల ఆశీర్వాదంతోనేని పేర్కొన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కేంద్రం నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం, కడపలో పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పి కేంద్రం విస్మరించిందన్నారు. మా చేతుల్లో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్మించేదని వెల్లడించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముడి ఇనుమును బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారని చెప్పారు. అదానీ కోసమే 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంద్రాకు ఐరన్‌ ఓర్‌ పంపిస్తున్నారని విమర్శించారు. బయ్యారంలో ఎప్పటికీ పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వెనుక కుట్ర జరుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వం బైలదిల్లా గనులను అదానీ పరం చేస్తున్నదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాపిటివ్‌ గనులు లేకుండా చేసి మూసివేస్తారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బయ్యారంలో క్వాలిటీ ఫెర్రస్ లేదని బీజేపీ నేతలు అసత్యాలు చెప్తున్నారు.. కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం దుర్మార్గమన్నారు.

బైలాదిల్లా ఐరన్ కంపెనీని జపాన్, కొరియా కంపెనీకి లీజుకు ఇచ్చారని.. దానిని రద్దు చేసి బయ్యారం, విశాఖ ఫ్యాక్టరీకి ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా సమస్యలను భట్టి ఎప్పుడైనా పట్టించుకున్నారా? సమస్యలు వదిలేసి భట్టి ఎక్కడో పాదయాత్ర చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విషయ పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ బిజెపి నాయకులు మాట్లాడడం మానుకోవాలని సూచించారు. బయ్యారంపై కేంద్రాన్ని నిలదీసేది పోయి కాంగ్రెస్ వంతపడడం సిగ్గుచేటు అన్నారు. ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ మొదటి నుండి వ్యతిరేకమే అన్నారు. బయ్యారంలో 134 లక్షల మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉందని ఎప్పటికైనా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే మదానికి కేటాయించిన లీజును రద్దు చేసి బయ్యారం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు కలిసి వస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు రాదన్నారు. దేశంలో సహజ వనరులను అదానీకి మోదీ కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలను లెక్కచేయకుండా వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవు అని మండిపడ్డారు. బండి పార్థసారధి రెడ్డిపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. బయ్యారంకు ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు బయ్యారంకు ఉక్కు పరిశ్రమ రావడం ఇష్టం లేదా అన్నారు. బీజేపీతో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే బీజేపీకి ప్రజలు ఉరి వేస్తారన్నారు.


Next Story