టోల్ ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోండి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 13 |
టోల్ ట్యాక్స్ పెంపు నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోండి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టోల్ ట్యాక్స్ పెంపుద‌ల నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీకి రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బుధవారం బ‌హిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప‌రిధిలోని నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి 32 టోల్‌గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వ‌సూలు చేసే ట్యాక్స్ మ‌ళ్లీ పెంచ‌తున్నార‌ని తెలిసిందన్నారు.

ఇప్పటికే కేంద్రం వ‌సూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్రజ‌ల‌కు పెనుభారంగా మారిందని పేర్కొన్నారు. మ‌ళ్లీ టోల్ ట్యాక్స్ పెంచితే మూలిగే న‌క్కపై తాటిపండు ప‌డ్డట్లుగా అవుతుందన్నారు. 2014లో రూ. 600 కోట్లు టోల్ ట్యాక్స్ వ‌సూలు చేశారని తెలిపారు. ఆ త‌ర్వాత‌ ప్రతి ఏడాది పెంచుకుంటూ పోయారని, 2023 నాటికి రూ.1824 కోట్ల టోల్ ట్యాక్స్‌ను వ‌సూలు చేశారన్నారు. ఈ తొమ్మిదేళ్లలో టోల్ ట్యాక్స్ 300 శాతం పెంచ‌డంతో.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగాయ‌ని మంత్రి లేఖ‌లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed