- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవా కార్యక్రమం.. ‘యాత్ర దానం’.. పోస్టర్ రిలీజ్ చేసిన మంత్రి పొన్నం
సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్ర దానం’ అనే వినూత్న కార్యక్రమానికి టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్ర దానం’ (Yatra Danam) అనే వినూత్న కార్యక్రమానికి (TGSRTC) టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన యాత్ర దాన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో (Minister Ponnam Prabhakar) మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక సేవలో భాగంగా వినూత్న ఆలోచనతో యాత్రదానం కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకు వస్తున్న టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని చాలా మందికి ఉంటుందని, అలాంటి వారికి యాత్ర దానం కార్యక్రమం ఒక వరమని అన్నారు. కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా టీజీఎస్ఆర్టీసీ యాత్రా నిధికి విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు కూడా తమ ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులకు యాత్రలను దానం చేసి తమ ఉదారతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో ఆర్టీసీ సిబ్బంది కృషి చేయాలన్నారు. అనంతరం.. ప్రజలకు మెరుగైన రవాణా సేవలను అందించడంతో పాటు సామాజిక బాధ్యత గల సంస్థగా ముందుకు వచ్చి యాత్రదానం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) అన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం.. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తోందని ఆయన వెల్లడించారు. “ఇది సామాజిక సేవ మాత్రమే కాదు. సాంస్కృతిక విలువల పరిరక్షణతో పాటు సమాజానికి ఇచ్చే మానవత్వపు బహుమతి. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, నిరుపేద విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లడం ద్వారా వారికి జీవితంలో మరపురాని అనుభూతి కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక ఆనందంతో పాటు సాంస్కృతిక అవగాహనను కలిగిస్తుంది. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కోరుతున్నాం. ముఖ్యంగా సమాజహితానికి ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు యాత్రాదానాన్ని వినియోగించుకోవాలి.” అని సజ్జనర్ కోరారు.
యాత్రదానం ఉద్దేశం
వ్యక్తుల పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు, తదితర ప్రత్యేక రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తాము జరుపుకునే శుభదినాన తగిన మొత్తాన్ని సంస్థకు విరాళంగా అందజేస్తే వారికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తోంది. యాత్రదానం కార్యక్రమ నిర్వహణ కోసం పేరుతో ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసింది. వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు స్పాన్సర్ చేసి.. అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు. సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చు. ఈ యాత్రాదాన కార్యక్రమాన్ని వ్యక్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వినియోగించుకోచ్చు. యాత్రాదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేస్తే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సంస్థ రూపొందించింది. దాతలు చెల్లించే విరాళం మేరకు కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను విహారయాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించి యాత్రాదానం కింద బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 కాల్ చేసి సమాచారం ఇస్తే సంబధిత ఆర్టీసీ అధికారులు ఫోన్ చేసి యాత్రదాన టూర్ ప్యాకేజీల వివరాలను తెలియజేస్తారు.
యాత్రదానం నిధికి మంత్రి పొన్నం, సజ్జనార్ చెరో లక్ష విరాళం
యాత్రదానం నిధికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెరో లక్ష విరాళంగా ప్రకటించారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్ లను ఆర్టీసీ ఉన్నతాధికారులకు వారు అందజేశారు. మంత్రి విరాళాన్ని అనాథలు, నిరాశ్రయులైన వృద్దులకు, నిరుపేద విద్యార్థుల విహారయాత్రలకు వినియోగించనుండగా.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విరాళాన్ని అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు తాడ్ బండ్ లోని సైన్స్ సెంటర్ లో సైన్స్ ప్రయోగాలు వీక్షించేందుకు వెళ్లేందుకు రవాణా సదుపాయం కోసం ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తో పాటు ఈడీలు మునిశేఖర్, రాజశేఖర్, ఖుష్రోషా ఖాన్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, హెచ్ఓడీలు శ్రీధర్, శ్రీదేవి, ఉషాదేవి, ప్రభులత, కవిత, తదితరులు పాల్గొన్నారు






