సీఎం పక్కన కూర్చొని సంతకం పెట్టిస్తా: పొంగులేటి

by Disha Web Desk 2 |
సీఎం పక్కన కూర్చొని సంతకం పెట్టిస్తా: పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వం అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ మాటలతో మీలాగే నేను కూడా నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి మాట్లాడారు. గతంలోనే జరగాల్సిన సింగరేణి ఎన్నికలను అప్పటి ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదని విమర్శించారు. గత ఐదేళ్లలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చిందని, తమ మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు.

ఇల్లందులో జేకేఓసీ విస్తరణలో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా.. ఇంకొక మైనింగ్ ఫిట్3తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తామన్నారు. కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలు కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ఇకనుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కారుణ్య నియామకాలు చేస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికల్లోను ఐఎన్‌టీయూసీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed