- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ వివాదాల్లేని తెలంగాణ కోసమే రీ సర్వే: అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్కు భూదార్ గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన 2,240 గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ రీ సర్వేపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించాలని, రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు, భూ యజమానులకు వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రజలు వ్యక్తం చేసే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ ప్రతి దశలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని సూచించారు. రీ సర్వే పనులను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.
అత్యాధునిక పరిజ్ఞానం..
భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది కుటుంబ జీవనాధారమని మంత్రి పొంగులేటి అన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేపట్టిందన్నారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతికతతో శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించడం వల్ల ప్రతి కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించబడతాయన్నారు. రీ సర్వే పూర్తయిన అనంతరం ప్రతి సర్వే నంబర్కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి, భూ భారతి పోర్టల్లో నమోదు చేయడం ద్వారా భూముల యాజమాన్యంపై శాశ్వత స్పష్టత ఏర్పడుతుందని మంత్రి తెలిపారు. దీనివల్ల భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయన్నారు. కార్యక్రమాన్ని అధికారులు కేవలం ప్రభుత్వ విధిగా కాకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ-సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నక్షా లేని 373 గ్రామాల్లో కూడా రీసర్వే చురుకుగా సాగుతోందని వీలైనంత త్వరితగతిన సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల్లో అధికారులు సర్వేకు వెళ్లినప్పుడు ముందుగానే పట్టాదారులకు విధిగా నోటీసులు ఇవ్వాలని, అదే విధంగా ఆ గ్రామంలో ప్రభుత్వ భూములకు మార్కింగ్ చేయాలని, గ్రామకంఠం హద్దులను నిర్ణయించిన తర్వాతే సర్వే చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సంతృప్తి చేందేలా సర్వే చేపట్టాలని ఏది చేసినా ప్రజా కోణంలోనే చేయాలని అన్నారు.






