సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టిన పొంగులేటి

by Disha Web Desk 2 |
సీఎం పదవిపై మనసులో మాట బయటపెట్టిన పొంగులేటి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి పదవిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో పొంగులేటి చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పళ్ళు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయని.. నా దగ్గర పండ్లు ఉన్నాయని అందుకే తనపై రాళ్లు విసురుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో నెంబర్-2 మీరేనా?, నెక్ట్స్‌ సీఎం మీరే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ‘రోజూ సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉంటే నెంబర్-2 ఎలా అవుతాను.

కాంగ్రెస్‌ పార్టీలో నేను చాలా జూనియర్‌ని. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే అది బుద్ధి తక్కువే అవుతుంది. హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది.. అయినా నేను సీఎం కావాలని అనుకోవట్లేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు’ అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 11 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్లలో పోటా పోటీ ఉంటుంది. బీజేపీ రెండు ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ ఒకటి గెలిచే చాన్సుంది’ అని పొంగులేటి షాకింగ్ కామెంట్స్ చేశారు.


Next Story