తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త.. ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక హామీ

by Disha Web Desk 2 |
తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త.. ఇళ్ల స్థలాలపై మంత్రి పొంగులేటి కీలక హామీ
X

దిశ, ముషీరాబాద్: అర్హులైన జర్నలిస్టులందరికీ ఏడాదిలోపు ఇండ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై పూర్తి సమీక్ష జరిపి ప్రణాళికను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పదేళ్లుగా జర్నలిస్టులు అన్యాయానికి గురయ్యారని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలను ఏకతాటిపై తీసుకువచ్చి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఎన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రేటర్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్యను అడిగి తెలుసుకున్నారు. పాత సొసైటీలతో పాటు కొన్ని కొత్తగా ఏర్పడిన సొసైటీలు కూడా ఉన్నాయని వివరించారు.

తమ సొసైటీ 2008లో ఏర్పడిందని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 40 ఏళ్ళకు పైబడి జర్నలిస్టుగా పని చేస్తున్న దాదాపు 1200 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారని మంత్రికి తెలిపారు. జర్నలిస్టులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళస్థలాలే తప్ప ఆ తర్వాత ఏ ప్రభుత్వం ఇవ్వలేదని సొసైటీ ప్రతినిధులు అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జర్నలిస్టుల ఇళ్ళస్థలాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ తయారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.



Next Story

Most Viewed