- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణ రైతులు, ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేస్తున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందన్నారు. భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది సర్వేయర్లు అవసరమవుతారన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం, మరో వైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీ చేయడం ఇంకో వైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. శుక్రవారం సచివాలయంలో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు.
అర్హులకు శిక్షణ
లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం) ఒక అంశంగా ఉండి, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐటీఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులకు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 చెల్లించవలసి ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో 50 పని దినాల్లో తెలంగాణ అకాడమి(ల్యాండ్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించి వీలైనంత త్వరగా లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, కమిషనర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖ జ్యోతి బుద్ధ ప్రకాష్, సీసీఎల్ఏ సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మంద మకరంద్ పాల్గొన్నారు.