ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు డిసైడ్ చేస్తారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏంత పెద్ద తురుమ్ ఖాన్ ఉన్న వదిలేది లేదు

by Disha Web Desk 13 |
ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలు డిసైడ్ చేస్తారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏంత పెద్ద తురుమ్ ఖాన్ ఉన్న వదిలేది లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని ఎంపీ ఎన్నికల్లో మరోసారి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తుక్కుగూడలో ఈ నెల 6వ తేదీన జరగబోయే జనజాతర సభ ఏర్పాట్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేము నరేందర్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఇవాళ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ తో పాటు తమ సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద తురుమ్ ఖాన్ ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏ మాజీ మంత్రికి అవసరం లేదని సెటైర్లు వేశారు. తప్పు చేసిన వారు ఎంత పెద్ద మనిషి అయినా వదలబోమన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ రైతులపై దొంగ ప్రేమ చూపిస్తోందని వారి ప్రభుత్వంలో ఏనాడైనా రైతన్నలను ఆదుకున్న పాపాన పోయారా అని ప్రశ్నించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫి చేసి తీరుతామన్నారు. ఆత్మహత్య చేసుకున్న 200 మంది రైతుల నివేదిక ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ చేసి 24 గంటలు అయినా బీఆర్ఎస్ స్పందించడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వ్యవహారలను ప్రజలు గమనిస్తున్నారని. ఎవరి తాట ఎవరు తీస్తారో రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.

సుమోటోగా కేంద్రమే చర్యలు తీసుకోవచ్చుగా: శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. ఇండియన్ టెలికాం యాక్ట్ ప్రకారం చట్టవ్యతిరేకంగా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయవద్దని, అలా చేస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ అధికారాలను ఉపయోగించుకుని సుమోటోగా స్వీకరించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు మేలు జరిగేలా బీజేపీ వ్యవహరిస్తోందని అర్థమవుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ ప్రమేయం లేకుండా చట్టప్రకారం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.



Next Story

Most Viewed