ఆదాయానికి మించి మంత్రి కేటీఆర్ ఆస్తులు: NVSS ప్రభాకర్

by Disha Web Desk 19 |
ఆదాయానికి మించి మంత్రి కేటీఆర్ ఆస్తులు: NVSS ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగంతో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలో కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆస్తులపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీచాతి నీచంగా పరుష పదజాలంతో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రధానమంత్రిని సైతం వదలకుండా తన్నుతాం, తరుముతామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారన్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై సైతం సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణలో మహిళా కమిషన్, బీసీ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే సుమోటాగా కేసు నమోదుచేసేవని పేర్కొన్నారు. ఈ కమిషన్లు నిజంగా పనిచేస్తే తొలుత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని ఆయన తెలిపారు. పార్టీ మొత్తం బండి సంజయ్ పక్షానే ఉందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను అధిష్టానం చూసుకుంటుందని ప్రభాకర్ తెలిపారు.

Next Story

Most Viewed