కేసీఆర్‌పై విమర్శలు మానకుంటే.. తరిమి తరిమి కొడతారు: మంత్రి కొప్పుల ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్‌పై విమర్శలు మానకుంటే.. తరిమి తరిమి కొడతారు: మంత్రి కొప్పుల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పట్ల దేశ వ్యాప్తంగా అన్నీ వర్గాల నుంచి ఆదరణ లభిస్తుండటంతో బీజేపీ నేతల మైండ్ బ్లాక్ అవుతుందని, బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బ తీయాలన్న కుట్రలు కుతంత్రాలు ఫలించవు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అమిత్ షా టూర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఏదో ఎన్నికల ముందు సభలు.. సమావేశాలు పెట్టుకొని బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పగటి వేశగాళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని, సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని పేర్కొన్నారు. రాష్ట్ర సంక్షేమం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని, ఏదో ఎన్నికల ముందు సభలు.. సమావేశాలు పెట్టుకొని పబ్బం గడిపేవారు కాదని పేర్కొన్నారు.

అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి రాలేదని, ప్రజలు అదరించి ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ మార్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోను అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ సమాజం గురించి అమిత్ షాకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పుడు మాటలు వినకుండా.. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తున్నామో.. ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నామో చెప్పుకోవాలన్నారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్ విమర్శలు మానుకోకుంటే మునుముందు తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొడుతారని హెచ్చరించారు.



Next Story

Most Viewed