కాంగ్రెస్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే.. ముందు ఆ పని చేయాలి: Koppula

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే.. ముందు ఆ పని చేయాలి: Koppula
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలు మాయ మాటలు.. గారడీలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని.. వాటిని నమ్మొద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గత రెండు ఎన్నికల్లోనే ప్రజలు కాంగ్రెస్‌ను తిప్పి కొట్టారని, అయినా ఏ మొహం పెట్టుకొని మళ్లీ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ దళిత గిరిజన డిక్లరేషన్ పచ్చి మోసం అన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఏమి ఒరగబెట్టారని ఇప్పుడు డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల బాగోగులు ఏనాడూ పట్టించుకోని వాళ్లంతా ఎన్నికలు వస్తున్నాయనగానే కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారని విమర్శించారు.

నిజంగా దళితులు గిరిజనులపై ప్రేమే ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఈ డిక్లరేషన్లు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో తొలుత డిక్లరేషన్ చేసిన తర్వాతే తెలంగాణలో అమలు చేయాలన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు ఏం మేలు చేశారని విమర్శించారు. జాతీయ పార్టీ అనిచెప్పుకుంటున్న కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అన్నారు. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అన్న రీతిలో వ్యవహారిస్తుందన్నారు. అధికారమే లక్ష్యంగా హామీలు ఇస్తున్నా ప్రజలు గమనిస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. మాయ మాటలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారకంలోకి వచ్చేది బీఆర్ఎస్ అన్నారు.

Next Story

Most Viewed