PCB అధికారులకు మంత్రి కొండా సురేఖ వార్నింగ్

by Disha Web Desk 2 |
PCB అధికారులకు మంత్రి కొండా సురేఖ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులు, సిబ్బందికి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. సిబ్బంది బాధ్యతలను నిర్లక్ష్యం చేయకూడదని, సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను విస్తృతంగా అమలుపరచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సనత్ నగర్‌లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో సోమవారం మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని అన్ని సెక్షన్‌ను కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు. అధికారుల నుంచి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

బయోమెట్రిక్‌లో నమోదైన వివరాలతో కూడిన హాజరు పట్టికను పరిశీలించి కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎవరెవరు లీవ్‌లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. భవిష్యత్‌లో తాను ఎప్పుడు తనిఖీ నిర్వహించినా అధికారులు, సిబ్బంది అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. అనంతరం కాలుష్య నివారణ, నియంత్రణకు కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న పరిశోధనలు, చర్యల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Next Story

Most Viewed