మీకోసం CM రేవంత్‌కు ప్రత్యేకంగా లేఖ రాస్తా.. జర్నలిస్టులకు మంత్రి కొండా సురేఖ కీలక హామీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-25 10:59:39  IST  )

రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల(Journalists) సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు.

మీకోసం CM రేవంత్‌కు ప్రత్యేకంగా లేఖ రాస్తా.. జర్నలిస్టులకు మంత్రి కొండా సురేఖ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల(Journalists) సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ-TWJF​) నాయకులు మంత్రి కొండా సురేఖను కలిశారు. ఈ సందర్భంగా హెచ్‌యూజే 2025 మీడియా డైరీని మంత్రికి అందజేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను హెచ్‌యుజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్వర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల కొత్తగా ఇస్తున్న హెల్త్ కార్డులతో కలిపి జర్నలిస్టులకు హెల్త్ కార్డు(Health Card)లు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ప్రతి జర్నలిస్టుకు ప్రతి ఏటా రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. రైతు బీమా మాదిరి అక్రిడిటేషన్ కార్డు(Accreditation Card) ఉన్న జర్నలిస్టులందరికీ జర్నలిస్టు బీమా అమలు చేయాలని మంత్రిని కోరారు. ఏదేని కారణంతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబాలకు కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అందేలా జీవిత బీమా పథకం తీసుకురావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కొండా సురేఖ.. జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం రేవంత్​రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.

ఐఅండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy)తో కూడా జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తానని చెప్పారు. ఇండ్ల స్థలాల సమస్య విషయంలో సీఎం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ యూ జే కార్యవర్గ సభ్యులు, సీనియర్ మహిళా జర్నలిస్టులు(Women Journalists) కంచి లలిత, పెద్దిరెడ్డి విజయ తదితరులు మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్​యూజే వర్కింగ్​ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బట్టిపాటి రాజశేఖర్, నాయకులు చిట్యాల మధుకర్, క్రాంతి, కొడవటి నవీన్, పూర్ణచందర్, రాజు, రేణయ్య తదితరులు ఉన్నారు.

Next Story