హైదరాబాద్‌తో సమానంగా నల్గొండను అభివృద్ధి చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-06 14:30:36  IST  )

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌తో సమానంగా నల్గొండను అభివృద్ధి చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం కుటుంబంలో పదవులు పంచుకున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

కేసీఆర్ ఎలా జాతిపిత అవుతారు?

తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ఎలా జాతిపిత అవుతాడని ప్రశ్నించారు. చెప్పడానికి ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటుంటే చలించి తాను మంత్రి పదవికే రాజీనామా చేశానని అన్నారు. కేసీఆర్ పాలనలో దొరపాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత కరెంటు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈనెల 11న జరిగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే డివిజన్లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను

ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 2000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య కుటుంబంలో వ్యక్తిగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని పేర్కొన్నారు. తనను ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేసిన ఇక్కడి ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని అన్నారు. 4వ డివిజన్ పరిధిలోని కేశరాజుపల్లిని గత ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ మారిస్తే ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తాను దానిని రద్దు చేయించానని తెలిపారు. ప్రచారంలో మంత్రి వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫిజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డి, 4వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోగరి వైష్ణవి, 5వ డివిజన్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్, 21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం, 20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్, 42వ డివిజన్ అభ్యర్థి పబ్బు సాయిశ్రీ, 41వ డివిజన్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 47 డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్, 48వ డివిజన్ అభ్యర్థి యామ కవిత దయాకర్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సౌమ్య కుటుంబానికి రూ.1కోటి రూపాయల చెక్కు అందజేత

Next Story