- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీసీసీ చీఫ్గా జగ్గారెడ్డిని నియమించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఆయన జగ్గారెడ్డి పేరును ప్రతిపాదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్ష పదవిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడిన ఆయన, పార్టీ సీనియర్ నేత టి. జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఆకాంక్షించారు.
జగ్గారెడ్డి మరో ‘పీజేఆర్’..
జగ్గారెడ్డి నాయకత్వ లక్షణాలను కొనియాడుతూ కోమటిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మాస్ లీడర్ అని, ఆయన పనితీరు అమోఘమని ప్రశంసించారు. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి (PJR) తరహాలో జగ్గారెడ్డికి ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం ఉందని, ఆయన్ని 'మరో పీజేఆర్'గా అభివర్ణించారు. ఒకవేళ జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా 100 సీట్లు గెలుచుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్గా కొనసాగుతుండగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
హరీశ్ రావు ఆరోపణల్లో నిజం లేదు: మంత్రి కౌంటర్
ఇదే క్రమంలో హ్యామ్ (HAM) రోడ్ల టెండర్లలో రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందన్న మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపణలను కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘అసలు అన్ని కోట్ల రూపాయల టెండర్లే పిలవనప్పుడు, అవినీతి జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదం. హరీశ్ రావు చేస్తున్నవన్నీ అవాస్తవ ఆరోపణలే’ అని మంత్రి స్పష్టం చేశారు.






