లీకేజీ బయట పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే.. మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
లీకేజీ బయట పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే.. మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ దీక్ష చేస్తున్నారని, ఎన్ని దీక్షలు చేసినా బీజేపీ నేతలకు ఉద్యోగాలు రావని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు రాష్ట్రంలో శాశ్వత నిరుద్యోగులుగా మిగిలి పోతారని పేర్కొన్నారు. శనివారం ఆయన టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా ప్రతి పక్షాలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని, కొందరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీ ఘటనపై నిరుద్యోగుల మద్దతు కూడగట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ధర్నా దీక్షలు చేస్తే ఢిల్లీలో చేయాలని, రాష్ట్రంలో కాదని సూచించారు. ఉన్న ఉద్యోగాలు ఊడ గొట్టింది మోడీ ప్రభుత్వమేనని, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు. ముందు దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయమని ప్రధాని మోడీకి చెప్పి బీజేపీ నేతలు ఇక్కడ ధర్నాలు చేయాలని సూచించారు. అపుడు బీజేపీ నేతలకు ఉద్యోగాలు ఇచ్చేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారన్నారు.

పేపర్ లీకేజీని బయట పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమేనని, నిరుద్యోగులకు నష్టం వాటిల్లకుండా చేసేది తామేనని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపించగలరా అని బండి సంజయ్‌కు సవాల్ చేశారు. పేపర్ లీకేజీలు కొత్తగా ఈరోజే జరగలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలకు ఎంతమంది రాజీనామా చేశారని నిలదీశారు. లీకేజీపై దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేత ఆధారాలు ఇవ్వాలని, సిట్ ముందు హాజరు కావడానికి బండి సంజయ్ లాగు తడుస్తోందని ఎద్దేవా చేశారు. ఓయూ ఘటనలో దొంగలను గుర్తిస్తామన్నారు. నోటిఫికేషన్లు వేసే దాకా దీక్షల్లో కూర్చుంటామని ప్రతిపక్ష నేతలు ప్రకటిస్తే అభ్యంతరం లేదన్నారు. నిరుద్యోగుల జీవితాలను ప్రతిపక్షాలు తమ రాజకీయ క్రీడలో బలి చేసే ప్రయత్నం చేస్తున్నాయని, సీబీఐ విచారణ అంటే ఉద్యోగాల భర్తీని అడ్డుకోవడమేనని, నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉండాలనేది ప్రతి పక్షాల ఆలోచన అని అన్నారు.



Next Story