ఆసియా ఖండంలో ఇదే పెద్దది: మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 2 |
ఆసియా ఖండంలో ఇదే పెద్దది: మంత్రి హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబుల్ ఇంజన్ సర్కార్‌లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారా? అని మంత్రి హరీష్ రావు నిలదీశారు. వారిది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని విమర్శించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు సభలో ప్రసంగిస్తూ.. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో హామీలు చెప్పారని, ఇళ్లు పోతే ఇళ్లు, బండి పొతే బండి ఇస్తామన్నారని గుర్తుచేశారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు.. బండి లేదు గుండు లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయి పని చేయవని విమర్శించారు. బీజేపీ వాళ్ళకి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని, మాటలు కోటలు దాటుతాయని, చేతలు పకోడిలా ఉంటాయన్నారు. హైదరాబాద్ నలుమూల లక్ష డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తున్నామన్నారు.

ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ అని చెప్పారు. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండని లబ్ది దారులకు సూచించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు ఇక్కడి ప్రజల సొంతమైందని, విలువైన స్థలంలో, ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ దన్నారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story