మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 19 |
మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి హరీష్ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. తల్లిని కోల్పోయిన మూడు నెలల పసిపాపకు పాల కోసం ఆ కుటుంబ సభ్యులు ప్రతి రోజు పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి చూసి చలించారు. ఆ పసికందుకు పాలు, పౌష్టిహారం అందించే ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించడంతో ప్రస్తుతం స్థానిక పీహెచ్‌సీ నుంచి పాప అవసరాలు తీరుస్తుండగా తండ్రి కోరిక మేరకు శాశ్వత పరిష్కారగా పాలిచ్చే ఆవును అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతం అయిన రాజుగూడకు చెందిన కొడప పారుబాయి (22) ఈ ఏడాది జనవరి 10న ఇంద్రవెల్లి పీహెచ్‌సీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లాక పది రోజులకే అనారోగ్యంతో తల్లి మరణించింది.

అప్పటి నుంచి ఆ పసిగుడ్డుకు ఆకలి తీర్చేందుకు ఆ కుటుంబం నానా అవస్థలు పడుతోంది. ఆ గ్రామంలో ఎవరికీ పాడీ పశువులు లేకపోవడంతో పాల ప్యాకెట్ల కోసం తండ్రి జగ్గుబాబు, తాత బాబుపావు వీరిలో ఎవరో ఒకరు ప్రతి రోజు రాజుగూడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిద్దరి ఖానాపూర్ వరకు కాలినడకన, అక్కడి నుంచి మరో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంద్రవెల్లికి వాహనాల్లో ప్రయాణం చేస్తూ పాల ప్యాకెట్లు తీసుకు వస్తున్నారు. పాప పరిస్థితిని వివరిస్తూ ఆకలి తీర్చేందుకు పాలిచ్చే ఆవును ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులు నెల రోజుల క్రితం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో వెంటనే స్పందిస్తూ తక్షణమే పసికందుకు పాలు, పౌష్టికాహారం అందిచే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story