కాళేశ్వరం జాతీయ హోదాపై తప్పుడు ప్రచారం.. మంత్రి హరీశ్ రావు

by Dishafeatures2 |
కాళేశ్వరం జాతీయ హోదాపై తప్పుడు ప్రచారం.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని పార్లమెంట్ లో కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని మంత్రి హరీష్ రావు ఖండించారు. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా తాను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావ మండిపడ్డారు. కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని, అయితే కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

2018లో టీఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందించారని, కేంద్రానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. కానీ, ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ - బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టిందని, ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం అని మండిపడ్డారు.

కేడబ్ల్యూడీటీ-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్రం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందన్నారు. కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదని మండిపడ్డారు. ఇది రాజకీయ కక్ష కాదా? అని ప్రశ్నించారు



Next Story

Most Viewed