అది రైతులకు శుభవార్తే.. మండలిలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
అది రైతులకు శుభవార్తే.. మండలిలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరదలో కూడా బురద రాజకీయం చేసే పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇస్తే, కేంద్ర మంత్రులు మాత్రం ఏం అనుమతులు లేవని అబద్దాలు చెబుతున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి కాలేదని మొన్న ఓ కేంద్ర మంత్రి అన్నారు.. డీపీఆర్ లేకపోతే కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేగంగా తామే అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పారని గుర్తు చేశారు. గోదావరి నది చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదని, గతంలో 1986లో 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఇటీవల వచ్చిన వరద 500 ఏళ్లలో అతి పెద్ద వరదదని, 29 లక్షల క్యూసెక్కులు నమోదు అయిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌ల మునగడం అనేది ప్రకృతి వైపరీత్యం మాత్రమేనని ఇందులో మానవ తప్పిదం లేదన్నారు. ప్రాజెక్టుకు ఏది జరిగినా ఏజెన్సీదే బాధ్యత ఉంటుందని సభలో మంత్రి వెల్లడించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరమ్మత్తు పనులకు సంబంధిత ఏజెన్సీలే చూసుకుంటాయన్నారు. అన్నారం పంప్ హౌస్ ఈ నెల మూడో వారంలో, మేడిగడ్డ అక్టోబర్ నెలాఖరులోగా ప్రారంభించి యాసంగికి రైతులను నీరు అందజేస్తామన్నారు.

ప్రతిపక్షాలకు సంతాపం:

ఈ నెలలో పంపు హౌస్‌లు తిరిగి పనిచేయబోతుండటం రైతులకు శుభవార్త అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు ప్రాణేశ్వరం అని ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. మరో నాలుగేళ్ల వరకు కాళేశ్వరం పంప్ హౌస్‌లు పని చేయవని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. కానీ, ఈ సభ ద్వారా ఈ నెలలోనే కాళేశ్వరం నీటిని విడుదల చేస్తామని ఇది రైతులకు శుభవార్త అవుతుందన్నారు. ప్రతిపక్షాల కలలు నెరవేరవని వారికి నా సంతాపం తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు శణేశ్వరంగా దాపురించారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు నిజాలు మాట్లాడాలని సూచించారు. లక్షల కోట్లు నీటి పాలయ్యాయని, మరో నాలుగేళ్లు నీటి విడుదల సాధ్యం కాదని చెప్పిన ప్రతిపక్ష నాయకులు రేపు నీరు విడుదల చేస్తే తల ఎక్కడ పెట్టుకుంటాని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు సైతం అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు పారలేదని చెబుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తానే స్వయంగా తన నియోజకవర్గానికి నీరు వదిలారని గుర్తుచేశారు. ఏ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం అనుమతులు ఇచ్చిందో అదే కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరో మంత్రి అనుమతులు లేవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అన్ని రకాల అనుమతులు ఇచ్చిన కేంద్రమే ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు.


Next Story