'నా ఇజ్జత్ తీయకుర్రి'.. అధికారులపై మంత్రి హరీష్ రావు సీరియస్

by Disha Web Desk 13 |
నా ఇజ్జత్ తీయకుర్రి.. అధికారులపై మంత్రి హరీష్ రావు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాన నియోజకవర్గానికి పక్కనే ఉన్న కరీంనగర్​జిల్లాలో సీ–సెక్షన్లు ఎక్కువ ఉండటంతో పాటు ఇతర హెల్త్ పార మీటర్లలోనూ పనితీరు తక్కువ ఉండటంపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్​రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నా ఇజ్జత్ తీయకుర్రి, ఎందుకీ పరిస్థితి ఉన్నది..? ప్రజల ఆరోగ్యం కోసం ఇంత శ్రమిస్తుంటే, కొన్ని జిల్లాల ఫర్మామెన్స్ ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని మంత్రి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మెటర్నిటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని వారం పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపి తగు చర్యలు చేప్టాలని ఆదేశించారు. దీంతో పాటు ఇమ్యూనైజేషన్ తక్కువగా నమోదవుతున్న సూర్యపేట జిల్లాకు ఇమ్యూనైజేషన్ విభాగం జేడీని క్షేత్రస్థాయి పరిశీనలకు పంపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

వైద్యారోగ్యశాఖ పనితీరు పై ఆయన సోమవారం ఉన్నతాధికారులు, డీఎమ్​హెచ్​వోలు, ప్రోగ్రామ్​ఆఫీసర్లతో టెలీ కాన్ఫరెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్​రావు మాట్లాడుతూ.మెటర్న్ హెల్త్ ఓవరాల్ పనితీరులో చివరి స్థానంలో ఉన్న వనపర్తి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సూర్యాపేట్ జిల్లాల్లో పురోగతి కనిపించాలని అన్నారు. కనిష్ఠ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన 53 సబ్ సెంటర్ల తీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కమిషనర్ ను ఆదేశించారు.

అన్ని పీహెచ్సీల్లో ఈ ఔషధీ ద్వారానే మందులు పంపిణీ చేస్తూ.. మూడు నెలల కనీస నిల్వలు ఉండేలా చూసుకోవాలన్నారు. డీఎంహెచ్వోలు సబ్ సెంటర్, పీహెచ్సీల స్థాయిలో రివ్యూలు నిర్వహించుకోవాలని, అందుతున్న వైద్య సేవల పట్ల క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన చేయాలని సూచించారు.

ప్రసవాల్లో ప్రభుత్వాసుపత్రులు టాప్..

వైద్యారోగ్య శాఖలో అందరం కలిసి చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. ఏప్రిల్ నెలలో దేశంలోనే మన ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డ్ సృష్టించాయన్నారు. 69 శాతంప్రసవాలతో ప్రభుత్వ ఆసుపత్రి గణనీయమైన వృద్ధి సాధించాయన్నారు.16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం గొప్ప విషయమన్నారు. సంగారెడ్డి (87), నారాయణ్ పేట్(83), మెదక్ (82), జోగులాంబ గద్వాల్ (81) సాధించిన జిల్లాలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

2014లో 30 శాతం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు ఉంటే, ఇప్పుడు ఏప్రిల్ వరకు 69శాతానికి చేరాయన్నారు. ఇదే తీరుగా ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ ప్రభుత్వ ప్రసవాలు నమోదు చేస్తున్న జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి నమోదు అయ్యేలా చూడాలన్నారు.

ఆశాలకు ప్రసూతి సెలవులు..

క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆశాలు, ఏఎన్ఎంలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకే వాళ్ల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అత్యధిక వేతనాలను ఆశాలకు ఇస్తున్నారని చెప్పారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 9750 ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని మంత్రి హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతిలను ఆదేశించారు.

జూన్ 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమం విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీపీహెచ్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed