ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష

by Dishanational2 |
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎఫ్‌సీఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలను రైతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవని, ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఎఫ్సీఐ ప్రమాణాలపై అధికార యంత్రాంగంతో పాటు బాధ్యతగల ప్రతి ఒక్కరూ ఈ అంశంపై రైతులకు అవగాహన పెంపొందించాలని తెలిపారు. మంగళవారం అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్‌తో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని, నేటి వరకు 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇది గత సీజన్ కన్నా పది లక్షల మెట్రిక్ టన్నులు అధికమన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడక్కడా ఎదురైతున్న ధాన్యం కొనుగోళ్లలోని సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తక్షణం స్పందిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 7907 కోట్ల విలువ గల ధాన్యాన్ని 6లక్షల 5వేల మంది రైతుల నుంచి సేకరించామని, గత కొన్ని రోజులుగా సరాసరి రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 400కి పైగా కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తై మూసేసామన్నారు. ఈ సమీక్షలో సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story