లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ.. మంత్రి గంగుల కమలాకర్​

by Dishafeatures2 |
Minister Gangula kamalakar
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని లబ్ధిదారులకు అందించేందుకు సర్వం సిద్దం చేశామన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​. ఈ స్కీమ్ నిరంతరాయ ప్రక్రియగా ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల పదిహేనో తారీఖున క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన ఒక్కో నియోజకవర్గంలో దాదాపు 300 మంది లబ్ధిదారులకు పథకాన్ని గ్రౌండింగ్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జిల్లా యంత్రాంగంతో వేగవంతంగా కొనసాగుతుందన్నారు.

కులవృత్తిదారులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి లక్ష రూపాయల తోడ్పాటును అందిస్తుందన్నారు. తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా వారి వృత్తికి సంబందించి పనిముట్లు, ముడిపదార్థాలు వంటివి తీసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి నెల పదిహేనవ తారీఖు వరకు లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story