రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు: మంత్రి గంగుల

by Disha Web Desk 2 |
రేషన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు: మంత్రి గంగుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పేదలకు రేషన్ పంపిణీ చేపడుతుందని, సంవత్సరానికి వేలకోట్లను వెచ్చిస్తూ నాణ్యమైన పోషకాలను పంపిణీ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ దారులకు ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో రేషన్ డీలర్ల సమస్యలపై గురువారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దాదాపుగా ప్రతి నెల 90 లక్షల కార్డులకు చెందిన 2 కోట్ల 82 లక్షల 60 వేల మందికి 1.80 ఎల్ఎంటీలకు కేటాయిస్తూ వీటికోసం రూ.298 కోట్లు ఖర్చుచేస్తున్నామని, ఏటా 3580 కోట్లు రేషన్ కోసం ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 17,220కు పైగా రేషన్ షాపులను నిర్వహిస్తున్నామని ఈ డీలర్లందరికీ నెలకు 12 కోట్ల పైచిలుకు కమిషన్ రూపంలో అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే పలుదపాలుగా రేషన్ డీలర్లతో చర్చించామని, వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశమవుతామని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, అధికారులు ఉషారాణి, లక్ష్మీభవాని తదితరులు పాల్గొన్నారు.

Next Story