జీవో 38 ప్రకారమే వైద్యుల బదిలీలు: మంత్రి దామోదర

by Prasad Jukanti |

జీవో 38 ప్రకారం పారదర్శకంగా వైద్యుల బదిలీలు చేపడతామని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు

జీవో 38 ప్రకారమే వైద్యుల బదిలీలు: మంత్రి  దామోదర
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియను ప్రభుత్వం జారీ చేసిన జీవో 38కి అనుగుణంగా అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో (TGDA) ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. గతంలో జనరల్ ట్రాన్స్‌ఫర్లు పారదర్శకంగా జరిగాయని, ఈసారి కూడా అదే విధంగా ట్రాన్స్‌ఫర్లు ఆఫ్లైన్‌లో చేయాలని డాక్టర్లు కోరారు. టీజీడీఏ ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని, 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి కూడా బదిలీల్లో అవకాశం ఇవ్వాలని, జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని కాలేజీల్లోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వాలని డాక్టర్లు విజ్ఞప్తి చేశారు.

అలాంటి వారికి బదిలీల్లో అవకాశం:

ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, పారదర్శకంగా ట్రాన్స్‌ఫర్లు చేపడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటళ్లను తీర్చిదిద్దుతున్నామని.. ఇందుకు డాక్టర్ల సంపూర్ణ సహకారం అవసరం అని మంత్రి పేర్కొన్నారు. కాలేజీలు, హాస్పిటళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవో ప్రకారం ట్రాన్స్‌ఫర్లు ఉంటాయన్నారు. అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, క్లినికల్ వర్క్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల్లోని కాలేజీలు, హాస్పిటళ్లలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి బదిలీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌ కుమార్, గవర్నమెంట్ డాక్టర్స్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరహరి, జనరల్ సెక్రటరీ లాలూ ప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story