సనత్ నగర్ టిమ్స్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయండి : అధికారులకు మంత్రి ఆదేశం

by Naga Rani Yarlagadda |

పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

సనత్ నగర్ టిమ్స్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయండి : అధికారులకు మంత్రి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్‌నగర్ టిమ్స్‌ను తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. సనత్‌నగర్‌‌ టిమ్స్‌లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌పై మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు, లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా.. ఓపీ రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ రూమ్‌లు, వెయిటింగ్ ఏరియా, డయాగ్నస్టిక్స్‌, రేడియాలజీ డిపార్ట్‌మెంట్, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ట్రయల్ రన్‌లో భాగంగా 22 డిపార్ట్‌మెంట్లలో ఓపీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆపరేషన్ థియేటర్లు శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్‌స్టాలేషన్ పూర్తి అయిందని తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్‌‌, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవమార్పిడి శస్ర్త చికిత్సలు నిర్వహించేలా క్యాథ్ ల్యాబ్స్, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మెడికల్ సర్వీసెస్‌తో పాటు సానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్‌ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. పేషెంట్లు, వారి అటెండెంట్లకు భోజన సదుపాయం కల్పించాలని, అటెండెంట్ల కోసం ధర్మశాలను సైతం సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, జాయింట్ సెక్రటరీ అయేషా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story