టెర్రరిస్ట్‌లతో ఎంఐఎంకు సంబంధం: MLA రాజాసింగ్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
టెర్రరిస్ట్‌లతో ఎంఐఎంకు సంబంధం: MLA రాజాసింగ్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనకు మరోసారి బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజెస్ వచ్చాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తనను చంపుతామంటూ పాకిస్తాన్ నుండి ఆగంతకులు ఫోన్ చేశారని చెప్పారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం డీజీపీకి ఫిర్యాదు చేసినట్టుగా గుర్తుచేశారు. కానీ, తన ఫిర్యాదుపై ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎవరిని అరెస్టు కూడా చేయలేదని మండిపడ్డారు. అసలు కమాండ్ కంట్రోల్ రూం ఎందుకు ఉంది? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్‌లు టాపింగ్ చేయడానికి, బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారని తెలుసుకోవడానికేనా? అని నిలదీశారు. మరోవైపు, పాతబస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని రాజాసింగ్ ఆరోపించారు. తనను బెదిరించిన ఆగంతకులు ఈ విషయాన్ని తనతో చెప్పారన్నారు.

టెర్రరిస్టులకు ఆర్థికంగా, ఫిజికల్‌గా ఎంఐఎం సహకరిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో హరేన్ పాండ్య హత్య కేసులో టెర్రరిస్టులను అరెస్టు చేసేందు వెళ్తే ఎంఐఎం నేతలు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో టెర్రరిస్టులకు ఎంఐఎం అండ ఉందని పోలీసులు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ఇకపోతే, బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని రాజాసింగ్ విమర్శించారు. తాను ధర్మం కోసమే చావాలని.. దేశద్రోహులను చంపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అవసరమైతే దేశం కోసం మళ్లీ జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తనకు జైలే ఫాంహౌస్ లాంటిదని.. తనపై వ్యక్తిగత కేసులు లేవని తెలిపారు.

Next Story

Most Viewed