అసెంబ్లీలో MIM వర్సెస్ బీఆర్ఎస్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఓవైసీ

by Disha Web Desk 19 |
అసెంబ్లీలో MIM వర్సెస్ బీఆర్ఎస్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఓవైసీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎంఐంఎం నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. అవి బయట అమలు చేయరని ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలువరని.. కనీసం మీ చెప్రాసిని అయిన చూపిస్తే వారినైనా కలిసి మా సమస్యలపై మాట్లాడుతామని అన్నారు. పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఓవైసీ నిలదీశారు. ఉర్ధూ రెండవ అధికారిక బాష అయినా అన్యాయం జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చిందని.. కానీ బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు. నోట్లరద్దు, జీఎస్టీకి మద్దతు ఇవ్వొద్దన్నామని.. బీజేపీ మొదటి నుండి తెలంగాణకు అన్యాయమే చేస్తోందన్నారు.

ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గొంగు చించుకున్నంత మాత్రన ఉపయోగం ఉందన్నారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వడం సరికాదన్నారు. బీఏసీ సమావేశానికి రాకుండా అక్బరుద్ధీన్ మాట్లాడటమేంటి అని అన్నారు. మంత్రులు అందుబాటులో ఉండటం లేరనడం కరెక్ట్ కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ మిక్షపత్రమైన ఎంఐఎంకు, బీఆర్ఎస్‌కు మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం సాగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక, తెలంగాణ అసెంబ్లీలో రెండవ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర సభ ముందుకు తీసుకువచ్చారు. మండలిలో గవర్నర్‌ ‍ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

Next Story

Most Viewed