రూటు మార్చిన Asaduddin Owaisi.. ఈ సారి KCR కు షాక్ తప్పదా?

by Disha Web Desk 4 |
రూటు మార్చిన Asaduddin Owaisi.. ఈ సారి KCR కు షాక్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు వేగవంతం చేశాయి. రాష్ట్రంలో కారు జోరు తగ్గించే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ పని చేస్తుండగా.. ఎంఐఎం తీరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల ఆ పార్టీ తీసుకుంటున్న లైన్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయబోతోందని, అలాగే తనకు పట్టున్న జీహెచ్ఎంసీ తో పాటు రాష్ట్రంలోని మిగతా చోట్ల పోటీకి రెడీ అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం గులాబీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. ఇదే గనుక నిజమైతే తమ పార్టీకి ఏ మేరకు డ్యామేజ్ చేస్తుందో అనే టెన్షన్ గులాబీ నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రూట్ మార్చిన ఒవైసీ

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రస్తుతం కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటున్నారు. నిజానికి ఒవైసీలు ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వారికి సన్నిహితులుగా ఉంటూ తమ రాజకీయ అవసరాలు తీర్చుకుంటారనే అభిప్రాయం ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావమో మరింకేమిటో కానీ రాబోయే రోజుల్లో ఎంఐఎంను తెలంగాణలోని ఇతర చోట్లకు విస్తరించాలని ఒవైసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణపై ఫోకస్ మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ విమర్శలకు స్పందిస్తున్న తీరు, ఆయన వైఖరి ఆసక్తిని రేపుతున్నాయి. రాజాసింగ్ ఎపిసోడ్ లో చోటు చేసుకున్న ఘర్షణ సమయంలో గతానికి భిన్నంగా ఒవైసీ తెలుగులో ట్వీట్ చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత కుట్ర అవసరమా అంటూ ఆయన మండిపడ్డారు.

అలాగే సెప్టెంబర్ 17 విషయంలోనూ ఎంఐఎం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజేపీ విమోచన దినోత్సవంగా జరపాలని నిర్ణయించగా.. ఈ రోజున జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపాలని ఎంఐఎం డిమాండ్ చేయడం.. గంటల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనుకూల నిర్ణయం ప్రకటించడం అందరని ని విస్తుపోయేలా చేసింది.

ఈ సారి కేసీఆర్ కు షాక్ తప్పదా?

ఇప్పటి వరకు తమ పార్టీకి కంచుకోటగా ఉన్న పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలతో పాటుగా రాబోయే ఎన్నికల్లో తమకు బలం ఉందనుకున్న చోట్ల పోటీకి సిద్ధం కావాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో ఎంఐఎంకు పట్టు ఉంది. 2018లో టీఆర్ఎస్ తో ఉన్న అవగాహన ఒప్పందం మేరకు ఓల్డ్ సిటీ మినహా మిగిలిన చోట్ల పోటీకి దూరంగా ఉంది. అదే ఎంఐఎం 2014లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బరిలోకి దిగినా.. ఎలాంటి ప్రచారం లేకుండానే రెండో స్థానంలో నిలిచి అందరికి షాకిచ్చింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా 42 వేల 148 ఓట్లతో గెలుపొందగా.. ఎంఐఎం నుంచి మీర్ మజాజ్ అలీ పోటీ చేసి 31 వేల 840 ఓట్లు సాధించారు. అంటే 23.53 శాతం ఓట్లు వచ్చాయన్నమాట. నిజామాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉంటే.. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 16 డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా ఎంఐఎం నుంచి గెలుపొందారు.

నిజామాబాద్ అర్బన్ లో మైనార్టీల ఓట్లు చెప్పకోదగ్గ విధంగా ఉండగా.. మున్నురు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా కీలకం అవుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే తమ అభ్యర్థిగా పెట్టి బరిలోకి నిలపాలని ఎంఐఎం భావిస్తున్నట్లు ఆ జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బోధన్ లో ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న షకీల్ మైనార్టీ నేతనే కావడం గమనార్హం.

ఇక్కడ కూడా పోటీ చేసే ఆలోచనతో ఎంఐఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఈ పరిణామం సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టినట్లు అవుతుందనే టాక్ వినిపిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ,మజ్లీస్ మధ్య వార్ పీక్స్ కు చేరగా.. వీరి మధ్య జరుగుతున్న వివాదంలోకి టీఆర్ఎస్ సైతం చొరబడి ఈ రెండు పార్టీలపై విమర్శలు చేయాల్సి వచ్చింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల సమయంలో కేసీఆర్ కు మజ్లిస్ మిత్రపక్షంగా ఉంటుందా లేక తెగదెంపులు చేకుసుని ఒంటరి ప్రయత్నం చేస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది.

Also Read: తెలంగాణ ఏర్పాటు ఫలాలు కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తోంది: అసోం సీఎం


Next Story

Most Viewed