T Congress: సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు.

T Congress: సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, నామినేటెడ్ పదవుల పంపకాలు, దివంగత బీసీ నేతలు ముఖేశ్ గౌడ్, శివశంకర్ ల విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ సీఎంతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుసగా పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పది ఉమ్మడి జిల్లాల డీసీసీలు, ఇన్ చార్జీలు, జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. వారి వద్ద పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంశంపై కూడా సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో అధిష్టానం ఆశావహుల లిస్ట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story