బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ

by Vemula.Srinu Prasad |

జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 21 మందికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 21 మందికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత విడతలో మరణించిన 17 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు, అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు 159 మందికి ఆర్థిక భరోసా కల్పించిందని వెల్లడించారు.

మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం, ఐదేళ్ల పాటు నెలకు రూ.3,000 పెన్షన్, కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1,000 చొప్పున ట్యూషన్ ఫీజు ఇస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, తోటి పాత్రికేయులు తమ మధ్య లేని సహచర జర్నలిస్టులను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, వివిధ పత్రికల జర్నలిస్టులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Next Story