కంటోన్మెంట్ బోర్డు వార్షిక బడ్జెట్‌ రూ.317 కోట్లు

by velandi.Saikiran |

రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం కంటోన్మెంట్ బోర్డు రూపొందించిన వార్షిక బడ్జెట్ కు అమోదం లభించింది.

కంటోన్మెంట్ బోర్డు వార్షిక బడ్జెట్‌ రూ.317 కోట్లు
X

దిశ, కంటోన్మెంట్ : రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) కంటోన్మెంట్ బోర్డు రూపొందించిన వార్షిక బడ్జెట్ కు అమోదం లభించింది. బుధవారం కంటోన్మెంట్‌ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ ఎస్‌. రాజీవ్‌ నేతృత్వంలో నిర్వహించిన బోర్డు సమావేశంలో సీఈఓ అర్వింద్‌ కుమార్ ద్వివేది, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ ఈటెల రాజెందర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ లు హాజరయ్యారు.కంటోన్మెంట్‌ వార్షిక బడ్జెట్‌ రూ.317 కోట్లతో సీఈఓ అర్వింద్‌ కుమార్‌ ప్రవేశపెట్టగా,పాలక మండలి ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించిన పరిహారం సొమ్ము రూ.316 కోట్లకు సంబంధించిన పనులకు కూడా బోర్డు ఆమోదం ముద్ర వేసింది. కాగా తొలుత వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఈఓ, కంటోన్మెంట్‌కు పన్నుల రూపంలో రూ.43 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.47 కోట్లు వస్తుందని తెలిపారు. రూ.15 కోట్లు ఆర్థిక సంఘం నిధులతో, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థల నుంచి రూ.53 కోట్ల సర్వీసు చార్జీలు, మిలటరీ కన్జర్వెన్సీ ద్వారా రూ.42 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.38 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోరామన్నారు. ఇందులో రూ.30 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉందని పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధికి రూ.20 కోట్లు కోరామన్నారు. ఈ నిధుల అంచనాలతో కంటోన్మెంట్‌ పరిధిలోని వివిధ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

డ్రైనేజీ ఆధునీకరణకు రూ.414 కోట్లు..

నాలాల అభివృద్ది, భూ గర్భ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ.414 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించినట్లు బోర్డు మీటింగ్ అనంతరం సిఈఓ ఆర్వింద్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రాజీవ్ రహదారి, మేడ్చల్ జాతీయ రహదారి (44) మార్గాల్లో నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌లకు సంబంధించిన పరిహారం సొమ్ము రూ.303 కోట్లు బోర్డుకు అందాయయని, త్వరలో మరో రూ.13 కోట్లు వస్తాయన్నారు. ఈ నిధులతో భూగర్భ డ్రైనేజీ లైన్‌ల ఆధునీకరణ రెండు దశల్లో చేపడతామన్నారు. తొలి దశలో రూ. 136 కోట్లతో 1 నుంచి ఆరోవార్డు వరకు, రెండో దశలో రూ.110 కోట్లతో 7, 8 వార్డుల్లో ఈ పనులు చేపడతామన్నారు. రూ.72 కోట్లతో పికెట్‌ నాలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నిధుల లభ్యతకు అనుగుణంగా తుది దశలో రూ.95 కోట్లతో హస్మత్‌పేట నాలా అభివృద్ధి పనులు చేపడతామన్నారు.

కోర్టు ఆదేశాల మేరకే..

బోయిన్‌పల్లి సర్వే నెంబర్‌ 157/1 పరిధిలోని 8 ఎకరాలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకే కాంపౌండ్‌ వాల్‌ కోసం అనుమతులు ఇచ్చామని సిఈఓ స్పష్టంచేశారు. ఈ స్థలం యాజమాన్య హక్కుల విషయంలో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మడ్‌ఫోర్ట్‌ సమీపంలోని బీ–4 స్థలంలో వెలిసిన బస్తీలో గుడిసెల కూల్చివేతలపై ఆందోళన అక్కర్లేదని సీఈఓ స్పష్టం చేశారు. ఈ మార్గంలో రోడ్డు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను మాత్రం తొలగిస్తామన్నారు. ఈ విషయంలో బస్తీవాసులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సిఈఓ సూచించారు.

Next Story