జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ హామీ

by Disha Web Desk 2 |
జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరఫున ఇండ్ల స్థలాలు వస్తాయని, వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి పూర్తి అవగాహనతో పాటు చిత్తశుద్ధి ఉన్నదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులు జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ (జేఎన్‌జే) తరఫున ప్రభుత్వానికి డబ్బులు కట్టారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వారికి స్థలాలు అందలేదన్నారు. దాదాపు 60 మంది జర్నలిస్టులు ఇంటి స్థలాలు అందకుండానే గత 17 సంవత్సరాలలో చనిపోయారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడినా వాటిని అమలు చేయడంలో అప్పటి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.

తొలుత వారి సమస్యను పరిష్కరించిన తర్వాత మిగిలిన పాత్రికేయుల ఇండ్ల స్థలాలపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒకే చోట కాకుండా నగరానికి నాలుగు వైపులా గుర్తించి ఎవరికి ఎక్కడ ఇష్టముంటే అక్కడనే ఇస్తే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ జర్నలిస్టుకు అక్రెడిటేషన్, ఇంటి స్థలం, హెల్త్ కార్డు వచ్చేలా కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రులలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు. జర్నలిస్టులు కూడా కొంత సొమ్మును హెల్త్ కార్డు కోసం కట్టడానికి ముందుకొస్తే మంచి చికిత్సను అన్ని ఆసుపత్రులలో పొందే విధంగా ప్రయత్నించవచ్చన్నారు. ఇప్పటివరకు మూడుసార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలలోనే అని గుర్తుచేశారు. ఇప్పుడు నాల్గోసారి పొందబోతున్నట్లు తెలిపారు.

మీడియా అకాడమీకి చైర్మన్‌గా తనను నియమించిన తర్వాత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, జర్నలిస్టుల సమస్యల గురించి క్షుణ్ణంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వానికి చెందిన అనువైన స్థలాలను గుర్తించవలసిందిగా రాష్ట్ర సర్కార్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో న్యాయపరమైన ఇబ్బందులుంటే అడ్వొకేట్ జనరల్ సలహాతో పరిష్కరించుకోవాలంటూ ముఖ్యమంత్రి సలహా ఇచ్చారని గుర్తుచేశారు. మీడియా అకాడమీకి కావాల్సిన బడ్జెట్, కార్యాలయానికి కావాల్సిన భవనం, అవసరమైన సిబ్బంది, అన్ని సౌకర్యాలు అందించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి తన ముఖ్య కార్యదర్శిని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.

పత్రికా యాజమాన్యాలను పక్కనపెట్టి వృత్తిపరమైన విలేకరులుగా జర్నలిజం ప్రమాణాలను పెంచడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని శ్రీనివాసరెడ్డి నొక్కిచెప్పారు. ప్రజల నుండి వచ్చే భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా రిపోర్టింగ్ చేసి ప్రజా పక్షపాతిగా పనిచేయాలన్నారు. సీఎం చీఫ్ పీఆర్వో (ముఖ్య పౌర సంబంధాల అధికారి) అయోధ్య రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇండ్ల స్థలాల విషయంలో కొంత కాలయాపన జరిగింది వాస్తవమేనని, వారికి గౌరవప్రదంగా రావలసిన ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని వివరించారు. త్వరలోనే దీనిని పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్, సియాసత్ ఉర్దూ దిన పత్రిక సంపాదకులు ఆమెర్ అలీ ఖాన్, అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన ప్రధాన కార్యదర్శి విరాహాత్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహారించారు.



Next Story

Most Viewed