మా ఫ్లెక్సీలే తొలగిస్తారా...? అర్ధరాత్రి బీఆర్​ఎస్​ నాయకుల వీరంగం..

by Disha Web Desk 11 |
మా ఫ్లెక్సీలే తొలగిస్తారా...? అర్ధరాత్రి బీఆర్​ఎస్​ నాయకుల వీరంగం..
X

దిశ, కూకట్​పల్లి: జీహెచ్​ఎంసీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి పొడవున ఎక్కడ పడితే అక్కడ వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడమే జీహెచ్​ఎంసీ ఎన్ఫోర్స్​మెంట్​ విభాగం సిబ్బంది పాలిట శాపం అయింది. మా ఫ్లెక్సిలే తొలగిస్తారా...? అంటు అర్ధరాత్రి కూకట్​పల్లి బీఆర్​ఎస్​ నాయకులు ఎన్ఫోర్స్​మెంట్​ విభాగం సిబ్బందిపై దాడి చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో తొలగిస్తున్నామని చెప్పిన వినిపించుకోలేదు. ఫ్లెక్సీలకు ఉన్న పైపులతో, పిడిగుద్దులు గుద్దుతూ తమ ప్రతాపాన్ని చాలి చాలని జీవితాలతో జీవితం వెళ్లదీసే కార్మికులపై చూపించారు. ఈ నెల 5వ తేది అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకోగా కార్మికులకు మద్దత్తుగా జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు నిలవకపోగా, కాంప్రమైజ్​ చేసుకోండంటూ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు సమాచారం.

తప్పెవరిది శిక్ష ఎవరికి...?

జీహెచ్​ఎంసీ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుడదు అన్న నిబంధనలు ఉన్నాయి. ఏకంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఎన్నో సందర్భాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సొంత పార్టీ నాయకులపైనే జరిమాన విధించేందుకు ఆదేశాలు జారి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 5వ తేది సోమవారం అర్ధరాత్రి భరత్​ నగర్​ నుంచి కేపీహెచ్​బీకాలనీ వరకు జాతీయ రహదారి పొడవున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సర్కిల్​ డీసీ ఆదేశాలతో ఎన్ఫోర్స్​మెంట్​ విభాగం సూపర్​వైజర్​ ఏ. శివశంకర్​, డ్రైవర్​ ఎం. రాజ్​ కుమార్​, కే. రాజు, ఎల్​. నాగబాబు, పి. అంజయ్యలు అర్ధరాత్రి విధులలో చేరి భరత్​నగర్​ నుంచి ప్లెక్సీలను తొలగిస్తూ వచ్చారు.

బాలాజీనగర్​ డివిజన్​ వివేక్​ నగర్​ కమాన్​ వద్ద 1:45 గంటల ప్రాంతంలో ఫ్లెక్సీలను తొలగిస్తుండగా కూకట్​పల్లికి చెందిన పది మంది అక్కడికి చేరుకుని తమ ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ దుర్భాషలాడుతూ గొడవకు దిగినట్టు ఎన్ఫోర్స్​మెంట్​ సూపర్​వైజర్​ శివ శంకర్​ తెలిపారు. అందులో బి. సంతోష్​, సిహెచ్​. ప్రభాకర్​ అనే ఇద్దరితో పాటు మరో ఎనిమిది మంది తమపై దాడి చేశారని, ఫ్లెక్సీలకు ఉండే పైపులతో, పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఇదిలా ఉండగా దాడికి పాల్పడిన వారు కూకట్​పల్లి డివిజన్​కు చెందిన బీఆర్​ఎస్​ నాయకులని ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బంది తెలిపారు.

డయల్​ 100.. అంటు మెసేజ్​ చేసిన డీసీ..

విధులు నిర్వహిస్తుండగా తమపై బీఆర్​ఎస్​ నాయకులు దాడికి పాల్పడుతున్నారని మూసాపేట్​ డీసీకి సమాచారం అందించగా డయల్​ 100 అంటు వాట్సప్​లో మెసేజ్​ చేసినట్టు సిబ్బంది తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విధులకు హాజరు అయిన తమపై దాడికి పాల్పడితే అర్ధరాత్రి తమను రక్షించడానికి ఎవరు అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బంది. అదే సమయంలో బీఆర్​ఎస్​ నియోజకవర్గం స్థాయి నాయకుడికి ఫోన్​ చేసి మాట్లాడించేందుకు ప్రయత్నించిన వినకుండా తమపై దాడి చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంప్రమైజ్​... లేదా సిబ్బందిపై తొలగింపు చర్యలు...?

5వ తేది అర్ధరాత్రి తమపై దాడి జరిగిందని ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బంది కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో 6వ తేది 6 గంటలకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు 7వ తేది వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 7వ తేది, బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదుకు సంబంధించిన అక్నాలెజ్​మెంట్​ కాపీని ఇచ్చారు. ఇదంతా ఒకవైపు కాగా గొడవను కాంప్రమైజ్​ చేసుకోండంటూ సిబ్బందిపై వత్తిడి పెరిగినట్టు సమాచారం కాంప్రమైజ్​ కాక పోతే ఉద్యోగం నుంచి తొలగించేందుకు పావులు కదుపుతారు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అర్ధరాత్రి ఎందుకు విధులకు పంపించారో...?

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు జీహెచ్​ఎంసీ ఎన్ఫోర్స్​మెంట్​ విభాగం రోజు పని వేళలలో నిరంతరం పని చేస్తుంటుంది. కాగా 5వ తేదీన ఫ్లెక్సీలు తొలగించేందుకు ప్రత్యేకంగా అర్ధరాత్రి సిబ్బందిని నైట్​ డ్యూటీ విధించి వారితో ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం వెనక మతలబు ఏముంది...? జూన్​ 2 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నుంచి 5వ తేది వరకు నియోజకవర్గంలోని జాతీయ, అంతర్గత రహదారులన్ని భారి ఫ్లెక్సీలతో నింపేశారు అన్ని పార్టీల నాయకులు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్​ నాయకుడు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సి పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అసలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు చర్యలు తీసుకోని అధికారులు కొంపలు ముంచుకు వచ్చినట్టు సిబ్బందిని బలి పశువులుగా చేస్తు అర్ధరాత్రి ప్రత్యేకంగా నైట్​ డ్యూటీ విధించి మరి ఫ్లెక్సీలను తొలగించేందుకు పంపడం వెనుక మతలబు ఏముందో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బందిపై దాడి జరిగిన విషయంలో జోనల్​ కమిషనర్​ను సిబ్బంది కలిసి తమ బాధను విన్నవించుకుంటే అసలు అర్ధరాత్రి ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బందికి డ్యూటీ ఎందుకు విధించారు అంటు సర్కిల్​ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

కేసు నమెదు అయ్యేలా చర్యలు తీసుకుంటాం: జోనల్​ కమిషనర్​ మమత

ఎన్ఫోర్స్​మెంట్​ సిబ్బందిపై దాడికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయంపై జోనల్​ కమిషనర్​ మమతను దిశ వివరణ కోరగా సిబ్బంది తనతో వచ్చి కలిసి దాడికి సంబంధించి సమాచారం అందించారని, సర్కిల్​ డీసీ రవి కుమార్​ను దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు జోనల్​ కమిషనర్​ మమత తెలిపారు.



Next Story

Most Viewed