బరితెగించిన వాసవి నిర్మాణ సంస్థ...

by Chintha Aamani |

మనల్ని ఎవరురా ఆపేది అన్న సినిమా డైలాగ్​ గుర్తు చేసుకున్నారో ఏమో ఏకంగా రెండు చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంది వాసవి నిర్మాణ సంస్థ.

బరితెగించిన వాసవి నిర్మాణ సంస్థ...
X

దిశ, కూకట్​పల్లి: మనల్ని ఎవరురా ఆపేది అన్న సినిమా డైలాగ్​ గుర్తు చేసుకున్నారో ఏమో ఏకంగా రెండు చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న నాలాను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంది వాసవి నిర్మాణ సంస్థ. 17 మీటర్లు ఉండాల్సిన నాలా కాస్త 9 మీటర్లు కుదించి నాలాలో మట్టిని నింపి నిర్మాణాలు చేపడుతున్నారు. కట్​ చేస్తే హైడ్రా కార్యాలయానికి అందిన ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ రంగంలోకి దిగారు. వాసవి నిర్మాణ సంస్థ కబ్జా చేసిన నాలా ప్రాంతాన్ని పరిశీలించి వాసవి నిర్మాణ సంస్థ పై క్రిమినల్​ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్​ ఏఈ ఫిర్యాదుతో కూకట్​పల్లి పోలీసులు వాసవి నిర్మాణ సంస్థపై ఎఫ్ఐఆర్​ నమోదు చేశారు.

అసలు ఏం జరిగింది..

జల కలతో కళకళలాడిన జలాశయాలు, తాగు, సాగునీరును అందించిన వందల ఎకరాల చెరువులు కూకట్​పల్లిలో రియల్​ ఎస్టేట్​ మాఫియా చేతిలో చిక్కి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. కూకట్​పల్లిలోని గొలుసు కట్టు చెరువులలోని ప్రధాన రెండు చెరువుల బంధాన్ని వాసవి నిర్మాణ సంస్థ తెంపి చెరువులతో పాటు నాలాను కబ్జా చేస్తు తన రియల్​ వ్యాపారానికి తెరలేపింది. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాముని చెరువు, మైసమ్మ చెరువులను కలుపుతూ ఉన్న నాలాను వాసవి నిర్మాణ సంస్థ మాయం చేసేందుకు పూర్తి ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే మైసమ్మ చెరువు ఎఫ్​టిఎల్​, బఫర్​ జోన్​లలో యధేచ్చగా నిర్మాణాలను చేపడుతున్న నిర్మాణ సంస్థ ఏకంగా రెండు చెరువు మధ్య ఉన్న నాలాను మింగేసేందుకు ప్రయత్నించింది. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఎంట్రీతో కబ్జా భాగోతానికి బ్రేక్​ పడింది. నాలాలో నింపిన మట్టిని హైడ్రా అధికారులు తొలగించి నాలా పూర్వ స్థితికి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

రెండు చెరువుల మధ్య నాలాను కుదించారు..

కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు 17 నుంచి 19 మీటర్లు వెడల్పు, 2.8 మీటర్ల లోతు ఉండాల్సిన నాలా ప్రస్తుతం 7 నుంచి 9 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. కాముని చెరువు అలుగు నుంచి పారుతున్న నాలాను వాసవి నిర్మాణ సంస్థ భారి రేకులను ఏర్పాటు చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకుని నెమ్మదిగా నాలాలో మట్టిని నింపి అక్కడే తమ నిర్మాణ పనులను చేపట్టింది.

ఇరిగేషన్​ అధికారుల నిర్లక్ష్యం..

ఇరిగేషన్​, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మైసమ్మ, కాముని చెరువులను కలుపుతూ ఉన్న నాలా కబ్జాకు గురవుతుందని, వాసవి నిర్మాణ సంస్థ నాలాను 17 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు కుదిస్తున్నారని వెలికి తీసి దిశ పత్రిక 2024 నవంబర్​ 1న ప్రత్యేక కథనం ప్రచురించింది. వాసవి నిర్మాణ సంస్థ నాలాను తమ సొంత నిధులతో నిర్మిస్తున్నారు, ఇరిటేషన్​ శాఖతో ఒప్పందం కుదిరిందంటు అప్పట్లో ఇరిగేషన్​ అధికారులు చెప్పి చేతులు దులుపుకున్నారు. వరుసగా ఫిర్యాదులో అందడంతో నాలా కబ్జా అయిన విషయాన్ని స్వయంగా హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సందర్శించి గుర్తించడంతో ఇరిగేషన్​ అధికారులు అవాక్కయ్యారు. హైడ్రా కమిషనర్​ ఆదేశాలతో వాసవి నిర్మాణ సంస్థ పై ఏఈ లక్ష్మీనారాయణ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్​పల్లి పోలీసులు వాసవి నిర్మాణ సంస్థపై ఎఫ్ఐఆర్​ నెంబర్​ 1036/2025 ద్వారా, బీఎన్​ఎస్​ 329(3), 324(4), 3 పీడీపీపీఏ, 35 వాల్టా చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Next Story