అన్నింట్లో 'ఆధారే' ఆధారం..

by Disha Web Desk 13 |
అన్నింట్లో ఆధారే ఆధారం..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఆధార్ కార్డుయే అన్నింటికి ఆధారం అని మేడ్చల్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. మొబైల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు చివరికి ఫేస్ బుక్ వాడాలన్నా ఆధార్ తప్పనిసరి అని గుర్తు చేశారు. భారత్‌లో నివసిస్తున్న ప్రతి పౌరుడు 12 అంకెలు గల ఆధార్ కార్డు ను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. శుక్రవారం మేడ్చల్ కలెక్టరేట్‌లో ఆధార్ మానిటరింగ్ కమీటి సమావేశం జరిగింది.

జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్‌తో కలిసి అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు లు లేని వారు తప్పకుండా ఆధార్ కార్డులు కలిగి ఉండేలా కమిటీ చూడాలని సూచించారు.

ఆధార్ కలిగిన ప్రతి ఒక్కరూ పదేళ్లకోసారి గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సీఐడీఆర్)లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ (ఎల్డీఎమ్) కిశోర్ కుమార్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారి పావని, అసిస్టెంట్ మేనేజర్ సత్య కళ (యూఐడీఏఐ), ఈడీఎమ్ భానుప్రకాశ్, మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed