దర్జాగా భూ కబ్జా చేసి దేవుడికే శఠగోపం పెడుతున్న భూ బకాసురులు!

by Disha Web Desk 12 |
దర్జాగా భూ కబ్జా చేసి దేవుడికే శఠగోపం పెడుతున్న భూ బకాసురులు!
X

దిశ, శామీర్ పేట: అంతా నా ఇష్టం.. ఎడాపెడా ఏం చేసినా అడిగేది ఎవడ్రా నా ఇష్టం.. అంటూ సినిమా పాటను తలపించేలా ఉంది దేవరాయాంజాల్ ప్రజాప్రతినిధుల తీరు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలోని తుంకుంట మునివిపాలిటీ పరిధిలోని దేవరాయంజాల్లో సర్వేనెంబర్ 665/2,666/2 లో గల 16 ఎకరాల్లో గల సుమారు 150 కోట్లు విలువ చేసే ఎండోమెంట్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఏకంగా రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు పెట్టి భూమిలోని చెట్లను తొలగిస్తున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు అంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ప్రభుత్వ, ఎండోమెంట్ భూములు కబ్జా లకు గురవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవాదాయ శాఖకు సంబంధించిన దేవుని మాన్యాలే కబ్జాలకు గురవుతుంటే ఇక సామాన్య ప్రజల భూముల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో కోట్ల కుంభకోణం జరుగుతున్న జిల్లా అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దేవాదాయ శాఖ భూముల కబ్జా విషయంలో గతంలో స్థానికులు ప్రజావాణి కార్యక్రమంలో, కలెక్టర్‌కి, ఎండోమెంట్ అధికారులకు ,విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాయాంజాల్ గ్రామస్థులకు స్థలాలను కేటాయించడం కోసమే జేసీబీ ద్వారా చెట్లను శుభ్రం చేయిస్తునట్టు స్థానికులు చెబుతున్నారు.

దేవాదాయ భూముల్లో స్థలాలు కబ్జా చేసి అమాయక ప్రజలకు విక్రయించడమే కాకుండా అధికార పార్టీకి చెందిన ప్రముఖ వ్యక్తి ఏకంగా భారీ ఎత్తున ఫంక్షన్ హాల్‌ను నిర్మించిన అటువైపు కన్నెత్తి కూడా చూడని వైనం అధికారులది అంటూ స్థానికులలో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతగా ఇల్లు లేని గ్రామస్థులకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లను ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారికంగా కేటాయించండి అంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దేవాదాయ శాఖకు అప్పగించాలని గతంలోనే న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన కొంత మంది అధికార పార్టీకి చెందిన నాయకులకు అవేమీ పట్టడం లేదు అంటూ స్థానికులలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

భూములు అన్యాక్రాంతం

కోట్ల కోట్ల విలువ చేసే ఎండోమెంట్ భూములు అన్యక్రాంతమవుతుంటే ఎండోమెంట్‌కు సంబంధించిన అధికారుల సైతం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు విమర్శలు వినిపిస్తున్నాయి రెవెన్యూ అధికారులకు ఎండోమెంట్ అధికారులకు ముడుపులు ముట్టడంతోనే అటువైపు చూడడం లేదంటున్న స్థానికులు. గతంలో ఎండోమెంట్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని అధికారులు సర్వేల మీద సర్వేలు చేసి హడావిడి చేసిన అధికారులు ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నాయకులు ఎండోమెంట్ భూములను కబ్జాలు చేసి గ్రామ ప్రజలకు పట్టాలిస్తామని ఎలా స్వాధీనం చేసుకున్నారు. ఆ గల్లీ లీడర్లకు ఎండోమెంట్ భూములను స్వాధీనం పర్చడానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడి భూములు అమ్ముకుంటూ...

ఎండోమెంట్ స్థలాన్ని చదును చేసి భూములు అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికుడు జైపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు స్థానికులకు ఉపయోగపడే విధంగా ఏమి చేయడం లేదని తెలిపారు. గతంలో జరిగిన నిర్మాణాలలో కూడా వీరికి వాటాలు ఉన్నాయని.. వీటి విషయమై కలెక్టర్ కార్యాలయంలో, ఎండోమెంట్, విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్య లు తీసుకోవడం లేదన్నారు.-జైపాల్‌రెడ్డి , స్థానికుడు

రెవెన్యూ ఇన్స్పెక్టర్ కుమార్ వివరణ

రెవెన్యూ అధికారిని వివరణ కొరకు ఫోన్ చేయగా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదని.. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తేనే తెలిసిందని వెంటనే విఆర్ఓలను పంపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More: చెరువు శిఖం హాంఫట్..రూ.5కోట్ల భూమిపై బకాసురుడి కన్ను



Next Story