గెలిచేదెవరు.. సొంత సర్వేలతో రాజకీయ పార్టీలు బీజీ బీజీ..

by Disha Web Desk 20 |
గెలిచేదెవరు.. సొంత సర్వేలతో రాజకీయ పార్టీలు బీజీ బీజీ..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అక్టోబరులోనే ఎన్నికలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నేతలంతా అలర్డ్ అయ్యారు. సొంత సర్వేలతో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రంగంలోకి దిగాయి. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో నేతల్లో సర్వేల గుబులు పట్టుకుంది. సర్వేలతో ఎవరి జాతకాలు తలకిందులవుతాయోనన్న టెన్షన్ ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, టికెట్లు ఆశీస్తున్న ప్రతి పక్షపార్టీల నేతల్లోనూ నెలకొంది. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ లు, ఆశావహుల బలాబలాలపై సర్వేచేయించి నివేదికలు తెప్పించుకున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం ప్రకటనతో మరోసారి సొంత సర్వేలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా...

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారాన్ని సొంతం చేసుకోవడమే ధ్యేయంగా అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, అనుహ్యంగా పుంజుకున్న బీజేపీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అందుకోసం సర్వే నివేదికలనే ప్రధాన ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే విధంగా సిట్టింగ్ శాసనసభ్యులతోపాటు టికెట్లు ఆశించే బలమైన నేతలు కూడా వ్యక్తిగతంగా సొంత సర్వేలకు సిద్దమయ్యాయి. ఒప్పటికే కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ముఖ్యనేతలు తాము ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయో స్పష్టంగా తెలుసుకునేందుకు బలమైన సంస్థల ద్వారా సర్వే చేయించుకున్నట్లు సమచారం.

ఇంకొందరు నేతలు సర్వేలకు సిద్దమవుతూ ఆయా ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారు. దీంతోపాటు టీడీపీ సైతం సర్వేలతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఠానేశ్వర్ సొంత జిల్లా మేడ్చల్ కావడం.. సీమాంధ్రులు అధికంగా నివాసం ఉండడంతో కనీసం రెండు, మూడు నియోజకవర్గాలలోనైనా జెండా ఎగుర వేయాలని వ్యుహా రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీయే ఫలానా నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలో దింపితే విజయావకాశాలు అనుకూలంగా ఉంటాయి అని తెలుసుకునేందుకు సర్వేల మంత్రం జపిస్తున్నాయి. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో ఎవరి నోట విన్నా సర్వేల మాటనే వినిపిస్తుంది.

సిట్టింగ్ బలాబలాలపైనా...

జిల్లాలో ఐదు నియోజకవర్గాలకుగాను ఐదుగురు అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ ఐదు నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యుహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇంచార్జిగా తన సన్నిహితుడు, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇన్ చార్జీగా నియమించారు. ఆత్మీయ సమ్మేళనాలను జోరుగా నిర్వహించారు. అయితే ఆత్మీయ సమ్మేళనాల్లో అంతర్గత కుమ్ములాటలు బయట పడడంతో బీఆరఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు శ్రీ కారం చుట్టంది. అసంతృప్త నేతలకు ఇతరాత్ర తాయిలాలను అశ చూపి, గొడవను సద్దమణిగించే పనిలో నిమగ్నమైంది.

ఇకపోతే కూకట్ పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాలలో మినహా ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గట్టి పోటీ నెలకొని ఉంది. మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతిసుభాష్ రెడ్డికి కాకుండా మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కుత్బుల్లాపూర్ లో కె.పి.వివేకానందకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు టికెట్ల కోసం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ లకు వ్యతిరేక వర్గంపై కూడా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ల కు టికెట్ ఇస్తే గెలుస్తారా..? వారిపై ఉన్న వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉంది.. వీరిని కాదని ఇతరులకు ఇస్తే గెలిచే అంశాలపై సర్వేల ద్వారా నివేదికలు తెప్పిస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీకి గుబులు..

సర్వేల్లో అధికార పార్టీపై వ్యతిరేకత బయట పడుతోంది. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రూపంలో ప్రమాదం పొంచి ఉంది. సంవత్సరకాలంగా అర్హులకు ఫించన్లను ఇవ్వకుండా నిలిపివేశారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రేషన్ సరుకులపై పేదలు పేదవి విరుస్తున్నారు. దలిత బంధు రాని వారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 58, 59 జీవోల ద్వారా ఇస్తున్న పట్టాలు సైతం అధికార పార్టీకి చెందిన కొందరికే ఇస్తున్నట్లు అధికార పార్టీ నేతలు అపవాదును మూట గట్టుకుంటున్నట్లు సర్వేల్లో వెల్లడవుతున్నట్లు ఓ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధి ‘దిశ’తో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.



Next Story

Most Viewed