సుధీర్ రెడ్డి దారెటు.. హస్తమా..? కమలమా...?

by Disha Web Desk 12 |
సుధీర్ రెడ్డి దారెటు.. హస్తమా..? కమలమా...?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ధిక్కార స్వరం పెంచారు. ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తి వెళ్లగక్కారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ఆత్మీయ సమ్మేళనాల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలోనే మంత్రిపై ద్వజమెత్తారు. మేడ్చల్ అభ్యర్థిని నేనే అని మల్లారెడ్డి ఎలా చెప్పుకుంటారు. అధిష్టానం అతని పేరును ఖరారు చేసిందా...? అని నిలదీశారు. గత కొంతకాలంగా మల్లారెడ్డి మలిపెద్దిల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. కాగా అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలను స్టేజీపైనే బట్టబయలు చేయడంతో సుధీర్ రెడ్డి తెగింపుకు కారణమేమిటనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీలోనే కొనసాగుతారా..? లేక ఏదైనా పార్టీ మారతారా..? అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.

మల్లారెడ్డి, మలిపెద్దిల వివాదానికి కారణం..

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో స్థానిక మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత మల్లారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కాదని ఎంపీగా కొనసాగుతున్న మల్లారెడ్డికి కేసీఆర్ టికెట్‌ను కేటాయించారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఘన విజయం సాధించారు. కెబినేట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. తనకు రావాల్సిన సీటును మల్లారెడ్డి అడ్డుపడి తీసుకున్నాడని సుధీర్ రెడ్డి పలు వేదికలపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే పార్టీ అధిష్టానం సుధీర్ రెడ్డి అసంతృప్తిని కొంతైనా చల్లార్చేందుకు గాను తన కుమారుడైన మలిపెద్ది శరత్ చంద్రారెడ్డికి జెడ్పీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించింది. అయినా మల్లారెడ్డి, మలిపెద్దిల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. రెండు వర్గాలుగా గ్రూపు రాజకీయాలు నడుపుతూనే ఉన్నారు.

సుధీర్ రెడ్డి ఉంటారా...? వెళ్లతారా..?

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.. ఇకపోతే మేడ్చల్ సభలో మంత్రి మల్లారెడ్డి నెక్ట్స్ నాకే మేడ్చల్ టికెట్ అని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన సుధీర్ రెడ్డి మంత్రి వ్యాఖ్యలను జీర్ణించుకోలేక ఆదివారం బోడుప్పల్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిపై ఫైర్ అయ్యారు. తన కుమారుడైన జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, తనకు తానే నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు వస్తుందని ప్రకటించుకోవడం ఏమిటనీ..? ప్రశ్నించారు. అయితే సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను పనిచేసుకోవాలని, ఈసారి మల్కాజిగిరి ఎంపీ, ఎమ్మెల్యే రెండు స్థానాలను గెలుచుకోని రావాలని సూచించినట్లు విశ్వసనీయ సమచారం. సీఎం అదేశాలతోనే ఇన్నాళ్లు మర్రిని దూరం పెట్టిన ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానిస్తున్నారు.

తాజా రాజకీయ పరిణామాలను గ్రహిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకు వచ్చే ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తన అనుచరులు చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేకంటే ఇతర పార్టీలోకి వెళ్లి, ఎమ్మెల్యే బరిలో నిల్చోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తన సమీప బంధువైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి‌తో ఇప్పటికే సుధీర్ రెడ్డి పలుమార్లు బేటీ అయినట్లు తెలిసింది. అయితే తన అనుచరులు కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ లోకి వెళితే విజయ అవకాశాలు కొంత మేరకు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నట్లు తెలిసింది. దీంతో సుధీర్ రెడ్డి హస్తం పార్టీలోకి వెళ్లతారా..? కమలం గూటికి చేరతారా..? లేక గులాబీ పార్టీలో నే కొనసాగుతారా..? అనేది తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే..



Next Story

Most Viewed