సిబ్బంది భద్రత, సంక్షేమానికి చర్యలు: సీపీ డీఎస్ చౌహాన్

by Disha Web Desk 11 |
సిబ్బంది భద్రత, సంక్షేమానికి చర్యలు: సీపీ డీఎస్ చౌహాన్
X

దిశ, మల్కాజిగిరి: పోలీసుల భద్రత, సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ను అధిగమించడానికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను, ఏసీ హెల్మెట్లను గురువారం ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేశారు. రాచకొండ ట్రాఫిక్ , రోడ్డు భద్రత విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిబ్బందికి భద్రతా పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించారు.

ఇందులో బాగంగానే ట్రాఫిక్ సిబ్బందికి రూ. 3.2 కోట్ల విలువైన స్పీడ్ లేజర్ గన్‌లు, డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలైన బారికేడ్‌లు, కోన్‌లు, బొల్లార్డ్స్, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, కిట్‌బ్యాగ్‌లు, సేఫ్టీ హెల్మెట్‌లు, మాస్క్ లు, రేడియం జాకెట్లు, సన్ గ్లాసెస్, గ్లోవ్స్, వాటర్ బాటిల్స్, జంగిల్ షూస్, రెయిన్ కోట్స్ వంటి కిట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. వేసవిలో ఎండల తీవ్రత నుంచి రక్షించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సరైన నెంబర్ ప్లేట్లు లేని, నకిలీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహన యాజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ పీపీ వి.సత్యనారాయణ, డి. శ్రీనివాస్, డీసీపీ రాచకొండ ట్రాఫిక్-II, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ హరి కృష్ణ, ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ రావు, ఎస్ హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed