విద్యతో పాటు క్రీడలకు సమయం కేటాయించండి: మంత్రి తలసాని

by Disha Web Desk 11 |
విద్యతో పాటు క్రీడలకు సమయం కేటాయించండి: మంత్రి తలసాని
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: విద్యార్ధులు విద్యతో పాటు కొంత సమయం క్రీడల కోసం కేటాయించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో మంత్రి తలసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.

ఇటీవలనే మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించిన విషయాన్ని వివరించారు. వేసవి సెలవులలో విద్యార్ధులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 వ తేదీ నుంచి 6 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులకు వివిధ క్రీడలలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తరచుగా క్రీడలలో పాల్గొనడం వలన మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్సాహంగా, దృడంగా తయారవుతారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించే క్రీడాకారులను తగిన విధంగా గౌరవిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని వివరించారు. విద్యార్ధులు ఇప్పటి నుంచే మంచి క్రీడాకారులుగా అభివృద్ధి సాధించేలా కృషి చేయాలని, తల్లిదండ్రులు కూడా వారిని అదేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీలు ముకుంద రెడ్డి, వేణుగోపాల్, కార్పొరేటర్ కొంతం దీపిక, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed