కలెక్టర్ అదేశాలు బేఖాతరు..! బదిలీ ఉత్తర్వులను అమలు చేయని ఎంపీడీఓ

by Disha Web Desk 11 |
కలెక్టర్ అదేశాలు బేఖాతరు..! బదిలీ ఉత్తర్వులను అమలు చేయని ఎంపీడీఓ
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కలెక్టర్ ఆదేశాలను అధికార యంత్రాంగం బేఖాతరు చేసింది. బదిలీ ఉత్తర్వులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. కలెక్టర్ ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ.. పోతే మేము దాన్ని అమలు చేయాలా..? అన్న రేంజ్ లో సహాయ నిరాకరణ చేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓ ఎంపీడీఓ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మండల పంచాయతీ అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ అమోయ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను శామీర్ పేట మండల అభివృద్ధి అధికారి వాణి అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బదిలీలు ఇలా...

జిల్లాలో లాంగ్ స్టాండింగ్ గా పనిచేస్తున్నమండల పంచాయతీ అధికారి (ఎంపీవో) లను జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. ఈ నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. కీసర ఎంపీవో పి. మంగతాయరును మూడు చింతలపల్లికి, శామీర్ పేట ఎంపీవో విస్లావత్ సునీతను మేడ్చల్ కు మూడు చింతలపల్లి ఎంపీవో బానోతు రవిని శామీర్ పేటకు, మేడ్చల్ ఎంపీవో కె.వినుత్నను కీసరకు బదిలీ చేశారు. అయితే వినూత్న సెలవులో ఉండడంతో ఘట్ కేసర్ ఎంపీవో బి. నందకీషోర్ కు కీసర ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

అయితే ఆ తర్వాత బదిలీలలో మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మరో ఆర్డర్ ను జారీ చేశారు. రెండోసారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కీసర ఎంపీవో మంగతాయరును శామీర్ పేటకు, శామీర్ పేట ఎంపీవో సునీతను మూడు చింతలపల్లికి, మూడు చింతల పల్లి ఎంపీవో బానోతు రవిని మేడ్చల్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్ నుంచి కీసరకు బదిలీ చేసిన వినూత్న విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే మొదట ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మూడు చింతలపల్లి ఎంపీవో రవి శామీర్ పేటలో చార్జ్ తీసుకోగా, రెండో ఉత్తర్వుల ప్రకారం సునీత మూడు చింతల పల్లిలో చార్జ్ తీసుకున్నారు.

కలెక్టర్ అదేశాలు బేఖాతరు..

కలెక్టర్ ఇచ్చిన రెండో ఉత్తర్వుల ప్రకారం శామీర్ పేటలో రిపోర్ట్ చేసిన బానోతు రవిని ఎంపీడీవో గరుదాస్ వాణి రిలీవ్ చేయాలి. కీసర ఎంపీవో మంగతాయరును శామీర్ పేట లో జాయిన్ చేసుకోవాలి. కానీ ఎంపీడీవో వాణి మాత్రం బానోతు రవిని రిలీవ్ చేయడంలేదు. దీంతో మంగతాయరును జాయిన్ చేసుకోవడంలేదు. దీంతో కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మంగతాయరు ప్రతి రోజు శామీర్ పేట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి వెళ్లుతున్నారు.

అదేవిధంగా మొదటి ఉత్తర్వుల ప్రకారం అప్పటికే డ్యూటీలో జాయిన్ అయిన రవి అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇద్దరు ఎంపీవోలు శామీర్ పేట మండల కార్యాలయానికి రావడంతో.. ఎంపీవోల బదిలీ వ్యవహారంలో అయోమాయం నెలకొంది. ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లుతారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాను మొదట ఇచ్చిన అర్డర్ ప్రకారం విధుల్లో చేరినట్లు రవి చెబుతుండగా, రెండో ఆర్డర్ ప్రకారం తాను శామీర్ పేటలో రిపోర్ట్ చేసేందుకు వస్తున్నట్లు మంగతాయరు చెబుతున్నారు. మరీ కలెక్టర్ మొదట ఇచ్చిన అదేశాలను అమలు పరిచిన ఎంపీడీవో వాణి, రెండోసారి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై సర్వాత్ర చర్చ నడుస్తోంది.

కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాల్సిందే: రమణ మూర్తి, జిల్లా పంచాయితీ అధికారి

ఎంపీవోల బదిలీ విషయంలో కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. లేదంటే సదరు అధికారిపై చర్యలు తీసుకుంటాం. జిల్లా బాస్ ఎన్ని సార్లు అదేశాలు ఇచ్చినా వాటిని పాటించాల్సి ఉంటుంది. అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు నివేదిస్తాం..

కీసరలో వద్దన్నారు.. మేము ఎలా తీసుకుంటాం: గరుదాస్ వాణి, ఎంపీడీవో, శామీర్ పేట

కీసరలో ఎంపీవోగా మంగతాయరు ను వద్దన్నారు. ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి పంపారు. అలాంటి ఆమెను తాము ఎలా తీసుకుంటాం. కలెక్టర్ మొదట ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బానోతు రవిని జాయిన్ చేసుకున్నాం. సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిపోయే రూట్ కాబట్టి ఇంత వరకు మూడు చింతల పల్లిలో రవికి చేసిన అనుభవం ఉన్నందున ఆయననే కొనసాగించాలి..




Next Story

Most Viewed