ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు: రేవంత్​ రెడ్డి

by velandi.Saikiran |   (  Updated:2026-03-09 20:45:28  IST  )

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు రేవంత్​ రెడ్డి.

ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదు: రేవంత్​ రెడ్డి
X

దిశ, కూకట్​పల్లి: తల తాకట్టు పెట్టైనా, అభివృద్ధి పనులకు నిధులు సమీకరిస్తానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గంలో హైడ్రా ఆధ్వర్యంలో పునర్​జీవం పోసుకున్న నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సి కుర్మయ్యగారి నవీన్​ కుమార్​, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్​ రెడ్డి, డిప్యుటి స్పీకర్​ రాంచంద్రనాయక్​, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ తన తల తాకట్టు పెట్టైన నిధులు సమకూరుస్తానన్నారు.

రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధి ఉన్నా, మల్కాజ్‌గిరి పార్లమెంట్​ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలలో నూటికి నూరు శాతం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు రేవంత్​ రెడ్డి. ఐదేళ్లు మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడుగా అన్ని 7 నియోజకవర్గాలలోని కాలనీలు, బస్తీలు చూసాను, ఇక్కడున్న కార్పొరేటర్​, కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా తనకు వ్యక్తి గతంగా పరిచయాలు ఉన్నాయని అన్నారు.

యాక్టివ్​గా పని చేసే కమిషనర్లను నియమించామ‌ని, చెరువులలో భూముల కోల్పోయిన వారికి నష్ట పరిహారాన్ని అందే విధంగా చూస్తామని తెలిపారు. ఎంపీగా చేయలేని పనులను సీఎం హోదాలో పూర్తి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్​, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, కుత్బుల్లాపూర్​ ఇన్​చార్జి కూన శ్రీశైలం గౌడ్​, గాలి బాలాజీ, శేరి సతీష్​ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, గొట్టిముక్కల దేశాల్​, సాధు ప్రతాప్​ రెడ్డి, రంగ మోహన్​, కొప్పిశెట్టి దినేష్​ తదితరులు పాల్గొన్నారు.

Next Story