భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి..

by Disha Web Desk 11 |
భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి..
X

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: నిర్మాణంలో ఉన్న ఓ భవనం 4వ అంతస్థు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిన కార్మికుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇన్ స్పెక్టర్ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ (40) కొన్ని సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోయిన్ పల్లి సమీపంలోని ఫిరోజ్ గూడలో భార్య పద్మ, కుమార్తె, వికలాంగుడైన కుమారుడితో కలిసి నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ రెండు సంవత్సరాల నుంచి నెల్లూరుకు చెందిన మాలాద్రి అనే బిల్డర్ వద్ద భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మాలాద్రి బిల్డర్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ పాయింట్ వద్ద 4వ అంతస్థు భవన నిర్మాణ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదవశాత్తు శ్రీనివాస్ కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. శ్రీనివాస్ ను చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed