అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీజేపీని సహించేది లేదు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 1 |
అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీజేపీని సహించేది లేదు: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, దౌల్తాబాద్: దుబ్బాక సమగ్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్, నర్సంపేట, మల్లేశంపల్లి, ముబారాస్ పూర్ గ్రామాల్లో ఎంపీ సుడిగాలి పర్యటన చేశారు. కోనాపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనం, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు చొప్పున మంజూరు చేశారు.

నిర్మాణం పూర్తయిన ఎస్సీ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎంపీ ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభోత్సవం చేయడం సరికాదని అనడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. అనంతరం నర్సంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘ భవనాన్ని ప్రారంభించారు. శౌరీపూర్ గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, మల్లేశంపల్లి గ్రామంలో గొల్ల, కురుమ సంఘాల భవనాలకు రూ.13 లక్షలు మంజూరు చేశారు. ముబారాస్ పూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రూ.14 లక్షలు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇవ్వలేకే బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన నాయకులు ఎటు పోయారంటూ, హామీలు ఏమయ్యాయంటూ ఎంపీ ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నీళ్లేవో, పాలేవో తెలిసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోస్యం చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎంపీకి ప్రజాప్రతినిధులతో పాటు పలు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రహీమొధ్దిన్, ఏఎంసీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాల రామాగౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచ్ లు స్వామి, స్వప్న జనార్ధన్ రెడ్డి, యాదగిరి, దార సత్యనారాయణ, ఎంపీటీసీలు నవీన్, తిరుపతి, కోనాపూర్ ఉప సర్పంచ్ రాజిరెడ్డి, కోనాపూర్ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు స్వామి, బుచ్చగౌడ్, బాబుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed